తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అత్యంత ఆసక్తి కలిగిస్తున్న పోటీ కూకట్ పల్లి నియోజకవర్గంలోనే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా అనూహ్యంగా ఎన్టీఆర్ మనవరాలు, దివంగత హరికృష్ణ కోడలు నందమూరి సుహాసిని బరిలోకి దిగారు. దీంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో కూడా ఈ నియోజకవర్గ ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి ఏర్పడింది. అందరి దృష్టీ ఈ నియోజకవర్గంపైనే ఉందనడం అతిశయోక్తి కాదు. అందుకు తగ్గట్టుగానే…తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇక్కడ విస్తృతంగా ప్రచారం చేశారు. అన్న కుమార్తెకు మద్దతుగా ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ సైతం ఈ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ప్రచారం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ కూడా ప్రచారం చేస్తారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే ప్రచారానికి ఈ రోజు చివరి రోజు అయినప్పటికీ ఇప్పటి వరకూ జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి సంబంధించి ఎటువంటి స్పష్టతా రాలేదు. సంకేతాలు ఆయన ప్రచారానికి దూరంగా ఉంటారని సాగుతోంది. సుహాసినికి మద్దతుగా ఒక్క ట్వీట్ చేసి ఊరుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి దూరంగా ఉండటం సినిమా షూటింగ్ లో బిజీగా ఉండటమేనా? మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణుల్లో వ్యక్తమౌతున్నాయి.