తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజిత్ కుమార్ చెప్పారు. కొద్ది సేపటి కిందట విలేకరులతో మాట్లాడిన ఆయన కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ వాటిని వెంటనే సరిచేసినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు వెనుదిరిగిన సంఘటనలు లేవన్నారు. సాయంత్రం ఐదు గంటల వరకూ పోెలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పారు. ఇలా ఉండగా ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూత్ ల వద్ద క్యూలలో నిలుచుని ఉండటం కనిపించింది. హైదరాబాద్ లో ఈ సారి పోలింగ్ శాతం గతం కంటే ఎక్కువ ఉండోచ్చన్న అంచనాలు వ్యక్తమౌతున్నాయి.