జాతీయ స్థాయిలో బీజేపీ ఏతర కూటమి ఏర్పాటుకు జరుగుతున్న యత్నాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఎద్దేవా చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించవని, వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన విపక్షాల మహాగట్బంధన్ ఒక భ్రాంతి అని వ్యాఖ్యానించారు. తరచూ కేంద్రంలోని మోడీ సర్కార్ విధానాలపై విమర్శలతో విరుచుకుపడుతున్న శివసేనపై మాట్లాడుతూ ఆయన శివసేన ఇప్పటికీ, ఎప్పటికీ బీజేపీ మిత్రపక్షమేనని అన్నారు. శివసేన ఎన్డీయే భాగస్వామిగా కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. విభేదాల పరిష్కారం కోసం బీజేపీ, శివసేనలు చర్చలు జరుపుతున్నాయని పేర్కొన్నారు.