`కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం`- ఇదీ తాజాగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నూజివీడు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు. దీంతో పార్టీ అలెర్ట్ అయింది. ఏం జరుగుతుంది? ఆయన పార్టీని వీడుతారా? లేక.. పార్టీలోనే ఉండి.. అసమ్మతి బాట పడతారా? అనేది ఆసక్తిగా మారింది. దీనిపై పార్టీ అధినేత వరకు విషయం వెళ్లింది. తాజాగా ముద్దరబోయిన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం, ఆయన పైవిధంగా వ్యాఖ్యలు చేయడం గమనిస్తే.. తాడో పేడో తేల్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
గత రెండు సందర్భాలలో నూజివీడు నుంచి పోటీ చేసిన ముద్దరబోయిన ఓడిపోయారు. 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ ఆయనకు అవకాశం ఇచ్చింది. అయతే.. రెండు సార్లూ ఆయన డింకీలు కొట్టారు. ఇప్పుడు కూడా టికెట్ ఇవ్వాలనేది ఆయన డిమాండ్గా ఉంది. ఆదిలో దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు ఓకే చెప్పారు. కానీ, ఇటీవల వైసీపీ నాయకుడు, పెనమలూరు ఎమ్మెల్యే కొలు సు పార్థసారథి.. పార్టీ మారుతున్నట్టు సంకేతాలు ఇవ్వడంతో నూజివీడును ఆయనకు కేటాయించే అవకాశం ఉందనిచర్చ ప్రారంభమైంది.
ఇటు ముద్దరబోయినతో పాటు అటు పార్థసారథి ఇద్దరూ కూడా యాదవ సామాజిక వర్గానికే చెందిన వారు. పార్థసారథి బీసీ, బలమైన యాదవ కమ్యూనిటీ దీనికి తోడు ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. నూజివీడు సీటు టీడీపీ ఎలాగూ బీసీలకే ఇవ్వాలనుకుంటోంది. ఈ సీటు పార్థసారథికి ఇచ్చే విషయంలో అధికారిక ప్రకటన రాకపోయినా ఆయన నూజివీడులో పర్యటిస్తూ వస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ, క్షేత్రస్థాయిలో కొలుసు ఫ్లెక్సీలు వెలవడం.. ఆయనకు అనుకూలంగా ఓవర్గం టీడీపీ నాయకులు నినాదాలు, పోస్టులతో హల్చల్ చేస్తుండడంతో పరిస్థితి యూటర్న్ తీసుకుంది.
ఈ క్రమంలోనే ముద్దరబోయినను ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబు తన చెంతకు పిలుచుకుని.. చర్చించారు. అయినా.. ఆయన ఎక్కడా శాంతించినట్టు కనిపించడం లేదు. పార్టీ అధికారంలోకి వస్తే.. ఎమ్మెల్సీ ఖాయమని చెప్పినా..టికెట్ కోసమే పట్టుబడుతున్నారు. అంతేకాదు..10 సంవత్సరాలలో ఇంటింటికి వెళ్లా, ప్రతి వ్యక్తిని కలిసా ప్రజా సమస్యలు తెలుసుకున్నా ..గెలుపు టిడిపి దేనని ప్రజల మాట, అధిష్టానం నిర్ణయం పై కార్యకర్తలు చెప్పే మాట నేను ఆచరిస్తాను అంటూ ముద్దర బోయిన కన్నీటి పర్యంతమయ్యారు.
దీంతో ఆయన అంసతృప్తి తీవ్ర స్థాయిలో ఉందనే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. దీనిపై చంద్రబాబు తక్షణమే నిర్ణయం తీసుకుంటారా? లేక.. ముద్దర బోయిన.. మార్పు దిశగా అడుగులు వేస్తారా? అనేది చూడాలి. ఇదే జరిగితే.. టీడీపీ ఓటు బ్యాంకులో చీలిక వచ్చే అవకాశంఉందని అంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.