నిన్న ఏకంగా సీఎం సీటు.. ఇప్పుడు ఏకంగా.. 30 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు సీట్లు.. ఇదీ.. ప్రస్తుతానికి బీజేపీ లెక్కగా ఉంది. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాలకు వెళ్లిన ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి.. తాజాగా కీలక ప్రతిపాదన చేసినట్టు తెలిసింది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో పొత్తుల విషయాన్ని ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆమె చర్చించారు. దిగువ స్థాయి నాయకులు ఆమెతో పొత్తులపై చర్చించారు. ఎగువ స్థాయి నాయకులు పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.
ఈ క్రమంలో పురందేశ్వరి.. ఏపీలో 30 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ భారీ స్థాయిలో విజయం దక్కించుకోవడం ఖాయమని పురందేశ్వరి చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా విశాఖలో 5 నియోజకవర్గాలు, విజయవాడలోని రెండు నియోజకవర్గాల్లో ఈ సారి గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమని ఆమెవెల్లడించారట. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలం, కార్యకర్తల దన్ను.. వంటివాటిని కూడా ఆమె ఒక నివేదిక రూపంలో వెల్లడించినట్టు తెలిసింది. ఇక, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోనూ 12 నుంచి 15 నియోజకవర్గాల్లో బలం ఉందని చెప్పు కొచ్చారు.
ఇక, పార్లమెంటు స్థానాలపైనా పురందేశ్వరి వివరించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ, విశాఖ, కర్నూలు, తిరుపతిల్లో ఈ దఫా.. గెలుపు పక్కా.. అని తేల్చి చెప్పినట్టు తెలిసింది. పార్లమెంటు స్థానాల్లో గత గెలుపు.. మెజారిటీలను కూడా ఆమె వివరించినట్టు సమాచారం. అంతేకాదు.. గెలుస్తారన్న నాయకుల జాబితాను కూడా ఆమె వివరించినట్టు పార్టీలో చర్చ సాగుతోంది. అయితే.. ఈ జాబితాలో ఒక కీలక నేత పేరును తీసేశారని పెద్ద ఎత్తున గుస గుస వినిపిస్తోంది. ఆయన గతంలో సోము వీర్రాజు కోటరీ నాయకుడిగా ఉన్నారట.
మొత్తంగా చూస్తే.. పొత్తులు ఇంకాఖరారు కాలేదని అంటున్నా.. పొత్తుల దిశగానే చిన్నమ్మ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని.. మొత్తంగా 25 నుంచి 30 అసెంబ్లీ సీట్లు సహా.. 6 పార్లమెంటు స్థానాలను కూడా.. ముందస్తు వ్యూహంతోనే ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అయితే.. గెలుస్తారా? అసలు పొత్తులో ఇన్ని సీట్లు ఇస్తారా? అంటే.. ఇస్తారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఇన్నిసీట్లు ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం పురందేశ్వరి వేసుకున్న కాకి లెక్కలపై ఏపీ రాజకీయ వర్గాల్లో బాగా కామెడీ నడుస్తోంది.