చైనాతో యుద్ధం… చైనాతో వైరం… చైనాతో లడాయి… ఇలా ఏమైనా కానీ మనకు చైనాకు పడడం లేదు కదా. అందుకే ఇప్పుడు ఇండియాలో సోషల్ మీడియాకి చాలా పని పడింది. చైనాకి వ్యతిరేకంగా వార్తలు వండి, వడ్డించడం. పుకార్లు సృష్టించి, సంచలనంగా మార్చి సర్క్యులేట్ చేయడం. పెరుగుతున్న సోషల్ మీడియా హవాలో ఫేక్ వార్తల గోల ఎక్కువయింది. వస్తున్నా వార్తల్లో ఏది నిజమో, ఏది కాదో తెలుసుకోవడమే పెద్ద పనిగా ఉంటుంది. అటువంటి ఫేక్ వార్తల్లో ఇది కూడా ఒకటి.
ఈ మధ్య DPIIT (భారతీయ పరిశ్రమల శాఖ ప్రమోషనల్) వెబ్ సైట్ పని చేయలేదు. రెండు రోజుల పాటు ఓపెన్ కాలేదు. అదిగో ఆ చైనా వాడే.. మన వెబ్ సైటు హాక్ చేసేసాడు, అన్ని చేసేస్తారు అంటూ ప్రచారం మొదలయ్యింది. ఇక మనకు సైబర్ ముప్పు ఉంది. చైనా సాంకేతికత ముందు మనం ఎంత వరకు..? అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. వీటిపై కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆ వెబ్ సైటు హాక్ అవ్వలేదని, రెండు రోజుల పాటు నిర్వహణ నిమిత్తం ఆఫ్ చేశామని ట్వీట్ చేసారు. దీన్ని పిఐబి కూడా తన ఫాక్ట్ చెక్ లో పేర్కొంది. ఎటువంటి వెబ్ సైటు హాక్ అవ్వలేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దంటూ విజ్ఞప్తి చేసింది.