హైదరాబాద్: టిఆర్ఎస్లో సిఎల్పి విలీనంపై దాఖలయిన పిటిషన్పై హైకోర్టు అసెంబ్లీ స్పీకర్కు నోటీసు జారీ చేసింది. సిఎల్పిని విలీనం చేసిన నేపథ్యంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి, ఎన్నికల కమిషన్లకు నోటీసులు జారీ చేసింది.
విలీన ప్రక్రియకు సంబంధించి గతంలో టి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి, సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్కలు కోర్టును ఆశ్రయించారు. అదే విధంగా శాసనమండలిలో టిఆర్ఎస్లోకి సిఎల్పి విలీనం చేయడాన్ని సవాల్ చేస్తూ నాడు కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ సైతం హైకోర్టును ఆశ్రయించారు.
ఈ రెండు పిటిషన్లపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీ నలుగురు ఎమ్మెల్సీలు, శాసనమండలి చైర్మన్, శాసనమండలి కార్యదర్శి, ఎన్నికల కమిషన్లకు నోటీసులు జారీ చేసింది. విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.
సిఎల్పి నేత మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై బుధవారం విచారణ జరగనుంది. అసెంబ్లీలో, శాసనమండలిలో సిఎల్పిని విలీనాన్ని సవాల్ చేస్తూ భట్టి విక్రమార్క పిటిషన్ దాఖలు చేశారు.