ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 టోర్నీకి లైన్ క్లియరైనట్లేనా.. అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. టీ20 వరల్డ్కప్పై ఐసీసీ ప్రకటన ఒక్కటే పెండింగ్లో ఉందని తెలిసింది. ఎందుకంటే.. కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో మళ్లీ 6 వారాల పాటు లాక్డౌన్ విధించారు. టీ20 వరల్డ్ కప్ జరిగేది అక్కడే కనుక ఐసీసీ ఇన్నాళ్లూ టోర్నీని నిర్వహించాలా.. వద్దా.. అని ఆలోచిస్తూ వచ్చింది. కానీ ఇక పరిస్థితి అక్కడ ఏమాత్రం బాగా లేకపోవడంతో ఐసీసీ ఎదుట ఒకే ఆప్షన్ మిగిలింది. అది వరల్డ్కప్ను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం.
నిజానికి ఐసీసీ అక్టోబర్లో జరగాల్సిన టీ20 వరల్డ్కప్పై ఎప్పుడో నిర్ణయం తీసుకోవాల్సింది. కానీ ఆస్ట్రేలియాలో పరిస్థితిని బట్టి తరువాత నిర్ణయం తీసుకుందాంలే.. అని దాటవేస్తూ వచ్చింది. జూలై నెలలో వరల్డ్ కప్ నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని ఐసీసీ బోర్డు గతంలో చెప్పింది. జూలై రానే వచ్చింది. అయినా బోర్డు సభ్యులు ఇంకా ఎటూ తేల్చలేదు. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడం.. అక్కడి మెల్బోర్న్ నగరంలో 6 వారాల పాటు మళ్లీ లాక్డౌన్ పెట్టడం.. వంటి పరిణామాలను గమనిస్తుంటే.. ఇకపై అక్కడ టీ20 వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యం కాదనే విషయం స్పష్టమవుతోంది. ఈ క్రమంలో ఐసీసీ ఆ టోర్నీని వాయిదా అన్నా వేయాలి.. లేదా రద్దు చేయాలి.. ఈ రెండు నిర్ణయాలే ప్రస్తుతం ఐసీసీ ఎదుట ఆప్షన్లుగా ఉన్నాయి. ఈ రెండింటిలో ఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా సరే.. అది బీసీసీఐకి ప్లస్ అవుతుంది. ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అవుతుంది. ఇప్పటికే ఐపీఎల్ నిర్వహణకు లైన్ క్లియర్ అయినట్లేనని తెలుస్తోంది. కానీ వరల్డ్ కప్పై ఐసీసీ స్పష్టమైన ప్రకటన చేశాకే.. బీసీసీఐ ఐపీఎల్పై తమ ప్రకటన వెలువరించే అవకాశం ఉంది. కనుక ఎటు చూసినా.. ఐపీఎల్ టోర్నీ జరుగుతుందనే అర్థమవుతుంది.
ఇక టీ20 వరల్డ్కప్ నిర్వహణపై మరో 3 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని ఇప్పటికే ఐసీసీకి చెందిన అధికారి మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో ఐసీసీ ప్రకటనపై బీసీసీఐ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ ఇప్పటికే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసి ఉంచుకుంది. శ్రీలంక, దుబాయ్, న్యూజిలాండ్ దేశాలు ఐపీఎల్కు ఆతిథ్యం ఇస్తామంటూ ముందుకు వచ్చాయి. మరోవైపు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఐపీఎల్ టోర్నీ షెడ్యూల్పై ఇప్పటికే కసరత్తు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే ఐసీసీ ప్రకటన కోసం బీసీసీఐ ఆతృతగా వెయిట్ చేస్తోంది. ఐసీసీ ప్రకటన వెలువడిన వెంటనే బీసీసీఐ ఐపీఎల్ షెడ్యూల్ను ప్రకటించే అవకాశం కూడా లేకపోలేదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఐసీసీ ఇప్పుడు ఏం నిర్ణయిస్తుందనే దానిపై అందరి దృష్టి నెలకొంది. మరి టీ20 వరల్డ్ కప్ భవితవ్యం ఏమవుతుందో చూడాలి.