కాపు సామాజిక వర్గం ఓట్లు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారిన విషయం తెలిసిందే. టీడీపీ-జనసేన పార్టీల పొత్తు వెనుక కూడా ఈ వ్యూహం ఉంది. కాపులను మచ్చిక చేసుకోవడం ద్వారా వచ్చే ఎన్నికల్లో వీరి ప్రాబ ల్యం ఉన్న సీట్లలో విజయం దక్కించుకుని అధికారం చేపట్టాలనేది వీరి ప్రయత్నం. ఈ క్రమంలోనే ప్రతిపక్ష పార్టీలు చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. అయితే.. వీరి ప్రయత్నాలను ఆది నుం చి గమనిస్తున్న వైసీపీ.. వీరి వ్యూహాలకు ప్రతివ్యూహాలు రెడీ చేస్తూనే ఉంది.
తాజాగా కాపు నేత కోసం.. ఓ కీలక ఎమ్మెల్యే విషయంలో వైసీపీ వ్యవహరించిన తీరు.. పార్టీలో చర్చగా మారింది. అయితే.. ఇది మేలు చేస్తే మంచిదే, కానీ, వ్యూహం రివర్స్ అయితే మాత్రం ఇబ్బంది తప్పదని అంటున్నారు పరిశీలకులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ముగ్గురు నేతలను సీఎం జగన్ వైసీపీ తరఫున ఎంపిక చేశారు. వీరిలో ఇద్దరు రెడ్లు, ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నారు. అయితే, ఆదిలో ఒక రెడ్డి-ఒక కాపు -ఒక ఎస్సీని ఎంపిక చేయాలని బావించారు.
అందుకే.. హుటాహుటిన కాపు సామాజిక వర్గానికి చెందిన చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు ఇస్తున్నట్టు ప్రచారంలోకి తెచ్చారు. అందుకే చిత్తూరు అసెంబ్లీలో ఆయన్ను తప్పించి రెడ్డి నేతకు అసెంబ్లీ టిక్కెట్ ఇచ్చారు. దీంతో మంచి ఈక్వేషన్ అని అందరూ అనుకున్నారు. అయితే ఆయన్ను చివరి నిమిషంలో వ్యూహాత్మకంగా తప్పించేసిన వైసీపీ, ఆరణి శ్రీనివాసులు స్థానంలో మేడా రఘునాధ రెడ్డి పేరును తెరపైకి తీసుకొచ్చింది. మేడా రఘునాధ రెడ్డి పేరు తెర మీదకు రావడంలో ఆసక్తికరమైన సమీకరణాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.
గుంటూరుకు చెందిన కాపు నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడు ఉమ్మారెడ్డి వెంకట రమణకు గుంటూరు లోక్సభ స్థానం కేటాయించారు. ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తనయుడికి ఆరణి శ్రీనివాసులు వియ్యంకుడు కావడంతో ఆయనను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన ఆరణి శ్రీనివాసులు కంటే.. ఉమ్మారెడ్డి తనయుడికి టిక్కెట్ ఇస్తే కాపు సామాజికవర్గం ఓట్లు పడతాయనే లెక్కలు వేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాపు నేతలకు పలు ఎమ్మెల్యే సీట్లతో పాటు కాకినాడ, బందరు, గుంటూరు పార్లమెంటు సీట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. మరి ఈవ్యూహం వర్కవుట్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.