అగ్రరాజ్యం అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం రేపాయి. అమెరికాలో తరచుగా కాల్పులు జరగడం తెలిసిందే. తాజాగా చైనా నూతన సంవత్సర వేడుకలు జరుగుతున్న లాస్ ఏంజిల్స్ లోని మాంటెరీ పార్క్ లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషయాన్ని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది.
దుండగుడు కాల్పులు జరిపిన సమయంలో ఘటనా స్థలంలో వేలాది మంది పాల్గొన్నారనీ, వీరంతా చైనీయుల లూనార్ న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారని స్థానిక మీడియా తెలిపింది. ఓ వ్యక్తి భారీ మెషన్ గన్ తో అక్కడకు వచ్చి కాల్పులకు పాల్పడినట్లుగా లాస్ ఎంజెల్స్ టైమ్ పేర్కొంది. రాత్రి ముగ్గురు వ్యక్తులు ప్రాణ భయంతో తన రెస్టాండెంట్ లోకి వచ్చి తలుపులు వేసేశారని అక్కడి సమీపంలోని బార్బెక్యూ రెస్టారెంట్ నిర్వహకుడు సియాంగ్ వాన్ చాయి మీడియాకు వెల్లడించారు. బయట ఓ వ్యక్తి గన్ తో కాల్పులు జరుపుతున్నాడని వారు చెప్పినట్లుగా సియాంగ్ తెలిపారు. ఆ సాయుధుడి వద్ద భారీగా మందుగుండు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. సమీపంలోని డ్యాన్సింగ్ క్లబ్ లక్ష్యంగా అతను దాడి చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.