న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు భేటీ అయ్యారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పిలుపు మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ కు చేరుకొని ఆయనతో సమావేశం అయ్యారు. లేహ్ లో పర్యటించిన రెండు రోజులకే రాష్ట్రపతి కోవింద్ నుండి ప్రధాన మంత్రి మోడీకి పిలుపు రావడం ఆసక్తిగా మారింది.
ఈ సమావేశంలో మోడీ తన లడక్ పర్యటన వివరాలు రాష్ట్రపతికి వివరించారు. లడక్ పర్యటనలో భాగంగా లెఫ్టెనెంట్ జనరల్ హరిందర్ సింగ్ ద్వారా తెలుసుకున్న వివరాలను కోవింద్ కు వెల్లడించారు. వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న వాస్తవ పరిస్థితులను అయన వివరించారు. లేహ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లను కలుసుకున్న విషయాలను, తన పర్యటనలోని అన్ని విశేషాలను రాష్ట్రపతి కోవింద్ తో పంచుకున్నట్లు సమాచారం. సైనిక బలగాల సన్నద్ధతను తెలిపారు.
అదే విధంగా కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా తీసుకుంటున్న చర్యలను కూడా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ కు పీ ఎం మోడీ వివరించారు.
కాగా జాతీయ, అంతర్జాతీయ విషయాలపై ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ లు చర్చించారని రాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ వేదికగా తెలియచేసింది.
గత కొద్ది రోజులుగా భారత్ -చైనా సరిహద్దు లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా సైనికుల దాడిలో 22మంది భారత సైనికులు అమరులు అయిన నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఎటువంటి పరిస్థితి ఎదురైనా ధీటుగా సమాధానం చెప్పేందుకు భారత్ సిద్దమై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నది. ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ రెండు రోజుల క్రితం అక్కడ పర్యటించి రావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది.