షర్మిలకు పూర్తిస్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సపోర్టు పలికారు. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా.. నేనున్నానంటూ.. ఆయన ముందుకు వచ్చారు. తాజాగా విశాఖలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభలో ఆయన షర్మిలను ఆకాశానికి ఎత్తేశారు. రేవంత్ సభలో మాట్లాడుతున్నంత సేపూ.. షర్మిల ముఖంలో రెండు వేల బల్బుల ఓల్టేజీ అంత కాంతి కనిపించింది. ముఖం మెరిసిపోయింది. ఇక, షర్మిలే ఏపీకి కాబోయే సీఎం అని కూడా రేవంత్ చెప్పేశారు. ఆమెను గెలిపించుకుంటే ప్రశ్నిస్తుందన్నారు.
సో.. మొత్తంగా చూస్తే.. రేవంత్ సపోర్టు భారీ ఎత్తున షర్మిల చేజిక్కించుకున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే.. ఇక్కడ అసలు విషయం వేరే ఉందనేది పరిశీలకుల మాట. తెలంగాణ మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న కేసీఆర్.. ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో.. వైసీపీకి సాయం చేసే అవకాశం ఉంది. గత ఎన్నికల్లోనూ ఆయన సాయం చేశారనే వాదన ఉంది. దీనిని ఎవరూ తోసిపుచ్చలేదు కూడా. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి.. అక్కడి కేసీఆర్కుచెక్ పెట్టే వ్యూహంలోనే ఏపీలో కాంగ్రెస్కు దన్నుగా మారారనేది వాస్తవం.
2018 ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు బీఆర్ఎస్ వాళ్లతో పాటు కేసీఆర్ చంద్రబాబును బాగా టార్గెట్ చేశారు. తర్వాత 2019లో జరిగిన ఏపీ సాధారణ ఎన్నికల్లో కేసీఆర్, బీఆర్ఎస్ కేడర్ అంతా వైసీపీకి సపోర్ట్ చేయడంతో పాటు కేసీఆర్ కొందరు తమ పార్టీ ఎమ్మెల్యేలను గుంటూరు జిల్లాకు పంపి మరీ వైసీపీ కి పరోక్షంగా ప్రచారం చేయమని డైరెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ఇష్టంగా అయినా కష్టంగా అయినా కేసీఆర్ , జగన్ కలిసి ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ ముందుకు సాగారు.
ఇక మొన్న ఎన్నికలకు ముందు షర్మిల తన పార్టీని కాంగ్రెస్ విలీనం చేసే క్రమంలో రేవంత్కు, ఆమెకు మధ్య కొంత గ్యాప్ నడిచింది. ఆమె పాలేరు సీటు అడిగినా దక్కలేదు. ఆమెను కాంగ్రెస్ లోకి తీసుకునే క్రమంలో రేవంత్ అడ్డు తగిలారు అన్న ప్రచారమూ నడిచింది. ఆ తర్వాత షర్మిల కాంగ్రెస్ లో చేరి ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో రేవంత్ అభినందించారు. ఆమెకు సోపోర్ట్ చేస్తున్నారు.
ఇక ఇప్పుడు కేసీఆర్.. ఏపీలోని వైసీపీకి మద్దతుగా నిలిచి.. హైదరాబాద్లో సెటిల్ అయిన వ్యాపారులు, ఏపీ తెలుగు వారు.. విద్యార్థులను తనవైపు తిప్పుకొన్నారు. అందుకే.. రాష్ట్రం మొత్తంగా బీఆర్ ఎస్ ఓడిపోయినా.. హైదరాబాద్ చుట్టుపక్కల విజయం దక్కించుకుంది. ఇది ఏపీ నుంచి తెలంగాణలో సెటిల్ అయిన వారి వల్లే సాధ్యమైందనే వాదన ఉంది. ఈ ఓటు బ్యాంకుకు గండి కొట్టేందుకే రేవంత్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారని అంటున్నారు పరిశీలకులు.
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మల్కాజిగిరి, చేవెళ్ల వంటి కీలకమైన లోక్సభ స్థానాలను సీఎం రేవంత్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీనిలో మల్కాజిగిరి ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం. ఇక్కడ గెలిచి తీరాల్సి న అవసరం కాంగ్రెస్కు, గెలిపించుకోవాల్సిన అవసరం రేవంత్కు కూడా ఉంది. ఇది సాధ్యం కావాలంటే.. ఏపీలో చక్రం తిప్పాలి. తద్వారా.. ఆయా నియోజకవర్గాల్లో మెజారిటీ ఓటు బ్యాంకు గా ఉన్న ఏపీ వారిని తనవైపు తిప్పుకొనే అవకాశం ఉంటుంది. అందుకే.. రేవంత్ చాలా వ్యూహాత్మకంగా ఏపీ పర్యటనకు వచ్చి.. ఏపీ సమస్యలపై గళం వినిపించారని అంటున్నారు పరిశీలకులు.