Super village : అవును, ఈరోజుల్లో అలాంటి గ్రామం ఉందంటే నమ్మశక్యంగా లేదు. అధునిక ప్రపంచం మొత్తం టెక్నాలజీ మాయలో చిత్తు అవుతోంది. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ ఫోన్లకి బానిసలు అయిపోయారు. గంటల తరబడి వాటిపైనే ఉంటున్నారు. ఈ క్రమంలో బంధాలు అనుబంధాలు బలహీనమవుతున్నాయి. ఇక పిల్లల చదువులు అటకెక్కుతున్నాయి, ఆరోగ్యాలు కూడా దెబ్బతింటున్నాయి. అందుకే మహారాష్ట్రలో సాంగ్లి జిల్లాలోని మోహిత్యాంచే వడ్గావ్ గ్రామ పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు.
డిజిటల్ మేనియా నుంచి అందరిని బయట పడేయడానికి అక్కడ ఓ వింత రూల్ పెట్టారు. ఆ గ్రామంలో ప్రతి రోజు రాత్రి ఏడు గంటలకు సైరన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే అందరూ తమ చేతుల్లో ఉన్న ఫోన్లు, ల్యాప్ట్యాప్లు, టీవీలు అన్ని బంద్ చేయాలి. పిల్లల్లో బద్ధకం పెరిగిందని, ఫోన్లలో ఎక్కువగా మునిగిపోతున్నారని, చదువులు చదవడంలేదని గ్రామపెద్దలు ఈ ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నారు. పిల్లలు ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా.. గంటన్నర పాటు.. వాటికి దూరంగా ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు.
ఈ రూల్ ప్రకారం.. ప్రతి రోజు రాత్రి 7 గంటలకు గ్రామంలో హారన్ మోగుతుంది. అలా మోగిన వెంటనే పిల్లలు, పెద్దలు అందరూ ఎలక్ట్రానిక్ వస్తువులను వదిలేయాలి. మళ్లీ గంటన్నరపాటు వాటి జోలికి వెళ్లకూడదు. గ్రామంలో ప్రతి ఒక్కరూ దీనిని పాటించాలి. అలా పాటిస్తున్నారో.. లేదో చెక్ చేయడానికి ఒక కమిటీని కూడా నియమించారు. ఇదిలావుంటే, ఈ గ్రామంలో మొదటి నుంచి సంప్రదాయాలను పాటిస్తున్నారు.. సామాజిక సామరస్యానికి పేరుగాంచిన గ్రామం. స్వతంత్ర సమర యోధులకు నిలయమైన ఈ గ్రామం పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తుంది. అందుకే ఎన్నో ప్రశంసలు అందుకుంది. ఏదిఏమైనా గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.