Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు లోక్ సభ ఎన్నికల వేళ ఊరట నిచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టు ఇవేళ మద్యంతర బెయిల్ మంజూరు చేసింది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం జూన్ 1 వరకూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఈ కేసులో విచారణకు రావాలంటూ దర్యాప్తు సంస్థ తొమ్మిద సార్లు సమన్లు జారీ చేసింది. వాటికి కేజ్రీవాల్ స్పందించకపోవడంతో అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం ఆయన తీహార్ జైల్ లో జ్యూడిషియల్ కస్టడీలో ఉంటున్నారు.
ఇదిలా ఉండగా, తన అరెస్టు ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ సందర్భంలో సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెయిల్ మంజూరు చేయవద్దంటూ ఈడీ వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం .. మద్యంతర బెయిల్ పై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాలని కేజ్రీవాల్ ను సుప్రీం కోర్టు ధర్మాసనం ఆదేశించింది.
అయితే లిక్కర్ స్కామ్ కేసు గురించి ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ మాట్లాడొద్దని ఈడీ తరపు న్యాయవాది కోరారు. దీనికి స్పందించిన ధర్మాసనం .. మీరు కూడా అంత కంటే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని సూచించింది. 21 రోజులు కేజ్రీవాల్ జైల్ లో ఉన్నా బయట ఉన్నా పెద్ద తేడా ఉండదని పేర్కొన్నారు. కాగా, కేజ్రీవాల్ కు జూన్ 4వ తేదీ వరకూ బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది కోరగా.. ఆ అభ్యర్థనను సుప్రీం కోర్టు తిరస్కరించింది. జూన్ 2వ తేదీన తిరిగి లొంగిపోవాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.