(అనంతపురం నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
మాజీ మంత్రి, టీడీపీ నేత జెసి దివాకరరెడ్డి ప్రభుత్వం షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నది. ఒక పక్క దివాకరరెడ్డి సంస్థల్లో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ మైనింగ్ శాఖ నేడు నోటీసులు జారీ చేయగా మరో పక్క తాడిపత్రి సీఐ ఫిర్యాదు మేరకు పోలీసులను దుషించారన్న ఆరోపణపై కేసు కూడా నమోదు అయ్యింది. సుమన, భ్రమరాంబ సంస్థల పేరుతో జేసి దివాకరరెడ్డి మైనింగ్ క్వారీ నిర్వహిస్తున్నారు. ముచ్చుకోటలో రెండు డోలమైట్ మైనింగ్ క్వారీలను ఆయన నిర్వహిస్తున్నారు. ఈ మైనింగ్ సంస్థల్లో కార్మికుల భద్రతను గాలికి వదిలివేశారనీ, మినిరల్ మేనేజర్ పర్యవేక్షణలో మైనింగ్ జరగడం లేదనీ విమర్శలు వస్తున్న నేపధ్యంలో అధికారులు క్వారీల్లో తనిఖీలు నిర్వహించారు. దివాకరరెడ్డి రెండు క్వారీల్లో నిబంధనలు ఉల్లంఘించారని మైనింగ్ డిప్యూటి డైరెక్టర్ రమణారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
క్వారీలో పర్మిట్ల అంశంపై నిన్న జెసి దివాకరరెడ్డి మైనింగ్ కార్యాలయానికి వెళ్ళారు. అయితే జెసి వెళ్లిన సమయంలో కార్యాలయంలో ఏడి లేరు. అనంతరం జేసి దివాకరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను కార్యాలయానికి వస్తున్నానని తెలిసే ఏడి కార్యాలయం వదిలి వెళ్లిపోయారన్నారు. తమ కుటుంబం జీవనాధరమే ఈ క్వారీలు, తమ కడుపుకొట్టవద్దు అని విజ్ఞప్తి చేస్తూ ఎనిమిది జీపుల్లో తమ క్వారీలు తనిఖీలు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. తమ క్వారీల్లో నక్సలైట్ లు ఏమైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇంతకు ముందు తమ సోదరుడు ప్రభాకరరెడ్డిని టార్గెట్ చేశారు. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నారని ప్రభుత్వం, అధికారులపై ఆరోపణలు చేశారు. పరోక్షంగా అధికారులకు హెచ్చరికలు కూడా చేశారు. పోలీసులు బదిలీలకు భయపడి అధికార పార్టీక ఊడిగం చేయవద్దని హితవు పలుకుతూ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ కార్యకర్తలే అధికారులను వదలరు, కాలం మారుతుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు.
అయితే జెసి దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై తాడిపర్తి సీఐ తోజోమూర్తి పిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేశారు. జెసిపై ఐపిసి సెక్షన్ 153ఏ, 506 సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు దివాకరరెడ్డి ట్రావెల్స్ బస్సులను సీజ్ చేయడం, ఆ తరువాత ఆయన సోదరుడు ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడును వాహనాల రిజిస్ట్రేషన్ అంశంలో అరెస్టు చేసి జైలుకు పంపడం, మళ్లీ జైలు బెయిల్ పై వచ్చిన రోజునే మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా దివాకరరెడ్డిపైనా కేసు నమోదు అయ్యింది.