పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కెరీర్ లో రూపొందుతున్న 20 వ సినిమా ‘రాధే శ్యామ్’. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజు సమర్పిస్తుండగా యువి క్రియోషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్, ప్రశీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు.
అయితే ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాలలో చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉండగా కరోనా కారణంగా కొంత భాగం టాకీ పార్ట్ కంప్లీట్ చేసి చిత్ర యూనిట్ ఇండియాకి వచ్చేశారు. విదేశాలలో జరపాల్సిన చిత్రీకరణను ఇక్కడ భారీ సెట్స్ వేసి, ఆ సెట్స్ లో షూటింగ్ జరపాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో హాస్పిటల్ సెట్ ను నిర్మిస్తున్నారట.
ఈ హాస్పిటల్ సెట్ లోనే ప్రభాస్ ..ఇతర తారాగణం పాల్గొనే కొన్ని కీలక సన్నివేశాలను, యాక్షన్ సీన్స్ ను షూట్ చేయనున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ గా కనిపించనుండగా..తాజా పూజా హెగ్డే కి సంబంధించిన మరో హాట్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ‘రాధే శ్యామ్’ పూజా హెగ్డే డ్యూయల్ రోల్ అని ప్రచారం మొదలైంది. మరి ప్రభాస్ కూడా డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడా ..అన్న సందేహాలు మొదలయ్యాయి. మొత్తానికి పూజా హెగ్డే డ్యూయల్ రోల్ అన్న ట్విస్ట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ కన్ఫ్యూజన్ లో పడ్డారట.