అమరావతి: కేశినేని నానికి మనసు ఉంటే ఆయన వల్ల కడుపుమంటతో రోడ్డెక్కిన కార్మికులను ఆదుకోవాలనీ లేకుంటే అధోగతిపాలేననీ వైసిపికి చెందిన పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పివిపి) శాపనార్ధాలు పెట్టారు.
విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నానికి చెందిన ట్రావెల్స్ ఉద్యోగులు జీతం బకాయిలు చెల్లించాలంటూ ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం లెనిన్ సెంటర్లో ధర్నా చేపట్టారు. దీనిపై కేశినేని రాజకీయ ప్రత్యర్ధి పివిపి ట్విట్టర్ వేదిగా స్పందిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
కసాయి వాడికి గెర్రె మీద ఉన్న ప్రేమ కూడా తన వద్ద పని చేసిన కార్మికులపై కేశినేనికి లేకపోయిందని పివిపి విమర్శించారు. వేలాది మంది పొట్టకొట్టి కేశినేని నేడు అందలమెక్కి కూర్చున్నాడని ఆయన ఆరోపించారు.
‘కడుపు కాలి ఆ కడుపుమంటతో రోడ్డెక్కిన ఆ వేలాది కుటుంబాలను మనసుంటే ఆదుకో, లేదంటే సంకనాకిపోతావ్ నీ బాస్ లాగా’ అంటూ పివిపి శాపనార్ధాలు పెట్టారు.
కాగా లెనిన్ సెంటర్ వద్ద నిర్వహించిన కార్మికుల దర్నాకు సిపిఐ నగర కార్యదర్శి దోనెపూడి శంకర్ సంఘీభావం తెలిపారు. మూడేళ్ల క్రితం ముందస్తు సమాచారం ఇవ్వకుండా కేశినేని ట్రావెల్స్ సంస్థను మూసివేశారని ఆయన ఆరోపించారు. తమకు ఎనిమిది నెలల జీతాలు చెల్లించకుండానే సంస్థను మూసివేశారనీ, జీతాల కోసం నాడు తాము డిమాండ్ చేస్తే అధికారులతో బెదిరించారని కార్మికులు ఆరోపించారు. లేబర్ కోర్టును ఆశ్రయిస్తే కేశినేని మనషులు తమను బెదిరిస్తున్నారని రంగారావు అనే కార్మిక నాయకుడు ఆరోపించారు. ఎన్నికల అఫిడవిట్లోనూ కార్మికులకు జీతాలు చెల్లించాలని నాని పేర్కొన్న విషయాన్ని దోనెపూడి శంకర్ గుర్తు చేస్తూ ఇంత కంటే సాక్ష్యం ఏమి కావాలని అన్నారు. ఇప్పటికే కొందరు కార్మికులు కార్మిక కోర్టును ఆశ్రయించారని చెప్పారు.
కాగా కేశినేని ట్రావెల్స్పై వస్తున్న ఆరోపణలను నాని ఖండించారు. ట్రావెల్స్లో పనిచేసిన ఎవరికీ బకాయి పడలేదని ఆయన స్పష్టం చేశారు. గుంటూరు లేబర్ కోర్టులో 14 మంది మాత్రమే కేసు పెట్టారనీ, కోర్టు ఆదేశాల మేరకు నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నానని నాని తెలిపారు. నిజంగా తాను బకాయి ఉన్నట్లు ఆధారాలు చూపిస్తే సెటిల్ చేస్తానని నాని చెప్పారు.
రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది మందికి జీతాలు ఇవ్వలేదని ట్వీట్లు చేస్తున్నవారు, ఆ వందల మంది కార్మికులు ఎవరో చూపించాలని నాని సవాల్ విసిరారు. ఎవరి ట్వీట్లకు తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని నాని పేర్కొన్నారు.