రాజకీయాల్లో తడాఖాలు చూపించడమూ.., సవాళ్లు చేసుకోవడమూ సహజమే. కాకపోతే అవి ప్రత్యర్థి పార్టీలపై, ప్రత్యర్థి పార్టీల్లోని నాయకులపై ఉండాలి..! కానీ ఓ వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే మాత్రం తన పార్టీకే తన కుటుంబ తడాఖా ఏమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా అంటూ బహిరంగ సవాలు చేసారు. జిల్లా మంత్రికి, కొందరు నేతలకు వార్నింగ్ ఇచ్చారు. కాక పుట్టించారు..!!
నెల్లూరు జిల్లా రాజకీయాలు భిన్నంగా ఉంటాయి. భిన్న సామజిక వర్గాల కలయికతో ఎప్పుడూ జోరుగా సాగుతుంటాయి. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఒకోరంటే ఒకరికి గిట్టదు. ఏదో అలా ఉంటారు అంతే, కానీ టైం వచ్చినప్పుడు గోతులు తీసుకుంటారు. ఇది వైసిపిలో ఇప్పుడు ఎక్కువయింది. నెల్లూరు జిల్లాలో వైసీపీ విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీరుపై ఆ జిల్లాలోనే సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి గుర్రుగా ఉన్నారు. అందుకే నిన్న బహిరంగ సవాలు చేశారు. అయితే వీటిని ఆ మంత్రి అనిల్ గానీ, ఆ పార్టీ అధినేత జగన్ గాని ఎంత వరకు పరిగణనలోకి తీసుకుంటారు అనేది కీలకంగా మారింది.
జగన్ కి కొరకరాని కొయ్యలుగా..!!
సీఎం జగన్ కి ఒక ప్రత్యేక స్ట్రాటజీ ఉంటుంది. అది బయటకు చెప్పరు. సైలెంట్ గా చేసుకుపోతారు. అందుకే 2019 లో గెలిచిన తర్వాత సీనియర్లకు, అందరూ ఊహించిన వారికి కాదని కొత్తవాళ్ళకి కూడా మంత్రులుగా అవకాశం ఇచ్చారు. సీనియర్లు, తన వాళ్ళు అని కాకుండా మొదటి నుండి తన వెంట నడిచిన వారికి ఎక్కువగా అవకాశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పార్టీలోకి ఆలస్యంగా వచ్చిన ఆనం రామనారాయణరెడ్డి, మహిధర్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్లకు అవకాశాలు రాలేదు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉంటూ చక్రం తిప్పిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు జిల్లాలో మంత్రుల వద్ద కనీసం మాట చెల్లుబాటు కాక తల దించుకుంటున్నారు. వీళ్లందరో అడపాదడపా పార్టీపైనే విసుర్లు వేస్తూ జగన్ కి కొరకరాని కొయ్యలుగా మారారు.
నిన్న ఆనం మరింత ఘాటుగా..!!
నెల్లూరులో అయితే ఆనం కుటుంబాన్ని మంత్రి అనిల్ కనీసం పట్టించుకోవట్లేదు. మంత్రి ఇచ్చిన చులకనతో అధికారులు కూడా ఆనం మాటలు లెక్క చేయట్లేదు. ఈ క్రమంలోనే నిన్న ఆనం వివేకానందరెడ్డి 70 వ జయంతి సందర్భంగా అతని ఫ్లెక్సీలకు కూడా అనుమతులు ఇవ్వలేదు. నెల్లూరులో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. అందుకే దీన్ని మనసులో పెట్టుకున్న వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీపై గురి ఎక్కుపెట్టారు. “జిల్లాలో కొందరు అతి చేస్తున్నారు. 2024 లో మా బలం ఏంటో చూపిస్తాం. ఆనం కుటుంబం తడాఖా వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం” అంటూ మంత్రి అనిల్ ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. ఆనం వివేకా కుమారుడు కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ పార్టీలో కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ఉద్వేగానికి గురయ్యారు. ఇది ఎక్కడ వరకు వెళ్తుందో..!!