దేశంలో ప్రాముఖ్యత కలిగిన అత్యంత భద్రతాపరమైన పార్లమెంట్ భవనాన్ని కూల్చి వేయడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దానిని కూల్చి వేసి అదే స్థానంలో ఆధునిక హంగులతో, సాంకేతిక సవకులతో కొత్త భవనాన్ని నిర్మించాలని కేంద్రం తలపెట్టింది. దీనిలో భాగంగా న్యాయ చిక్కులు ఎదురవ్వకుండా, ఇతర పక్షాల నుంచి ఇబ్బందులు రాకుండా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంది. అందుకే సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. పార్లమెంట్ భవనాన్ని కూల్చివేయడానికి దాని స్థానంలో కొత్తది నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలంటూ పేర్కొంది.
ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమనీ, భద్రతా పరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయనీ కేంద్రం కోర్టు కు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నది. అంతే కాకుండా ఏవైనా తీవ్రమైన అగ్ని ప్రమాదాలు సంభవిస్తే కూడా కష్టమేనని తెలిపింది. అందుకే ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం చెబుతున్నది. ఈ మేరకు మంగళవారం సుప్రీం కోర్టు లో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.
పార్లమెంట్ భవనం గురించి క్లుప్తంగా…
ఈ భవనాన్ని బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ‘హెర్బర్ట్ బేకర్’1912-13 లో డిజైన్ చేశాడు. భవన నిర్మాణం 1921లో ప్రారంభించగా 1937 నాటికి పూర్తి అయ్యింది. దీని పైకప్పుకు 257 గ్రానైట్ స్తంభాలు సపోర్టుగా నిలబెట్టారు. ఇప్పటికి దాదాపు వందేళ్లు గడిచాయి. ఇప్పటికే ఇందులో చాలా సమావేశాలు జరిగాయి.
పార్లమెంట్ పై ఉగ్ర దాడి
2001 డిసెంబర్ 13 న సాయుధ ఇస్లామిక్ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి చేసారు. లష్కర్-ఎ-తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్ సంస్థలకు చెందిన ఉగ్రవాదులు దాడి చేయగా భద్రతా దళాలు వీరిని సమర్ధవంతంగా ఎదుర్కొని, దాడిలో పాల్గొన్న మొత్తం ఐదుగురు ఉగ్రవాదుల్నీ హతమార్చారు. నాడు ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఢిల్లీ పోలీసు సిబ్బంది, ఒక సీఆర్పీఎఫ్ మహిళతో పాటు, ఇద్దరు పార్లమెంటు భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి – మొత్తం తొమ్మిది మంది అమరులయ్యారు. ఈ దాడికి కీలక పాత్ర పోషించిన ఉగ్రవాది అఫ్జల్ మహ్మద్కు భారత సుప్రీం కోర్టు ఉరిశిక్షను విధించింది.