ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ ఎన్కౌంటర్ లో ఎనిమిది మంది పోలీసులను కాల్చిచంపిన కేసులో ముఖ్య నిందితుడు మరియు ప్రధాన గ్యాంగ్ స్టర్, కరడుగట్టిన నేరస్థుడు అయిన వికాస్ దుబే నేడు చాలా అనుమానస్పద రీతిలో పోలీసులు ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. 2001లో రాష్ట్ర మంత్రి సంతోష్ శుక్లా హత్య కేసులో వికాస్ ప్రధాన నిందితుడు. అతడి కోసం అప్పటి నుండి పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత 2004లో కేబుల్ వ్యాపారవేత్త దినేష్ హత్య కేసులో కూడా వికాస్ నిందితుడు.
ఇటీవల పోలీసులని వికాస్ హత్య చేసిన అనంతరం అతడిని నిన్న మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని లోని మహంకాళి ఆలయం నుండి అరెస్ట్ చేశారు. అయితే అసలు ఏడు వందల కిలోమీటర్లు ఉత్తరప్రదేశ్ నుండి ఉజ్జయిని కి అతను ఎలా ప్రయాణం చేయగలిగాడని… పోలీసుల సహకారం లేకుండా అతను అంత దూరం వెళ్లే అవకాశమే లేదని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి.
ఈ సమయంలో అతడి అరెస్టు పోలీసులకు మరియు అధికారపక్షానికి కొద్దిగా రిలీఫ్ ఇచ్చినా కూడా విచారణలో అతను చాలా సంచలన విషయాలను పోలీసులకు చెప్పాడు. పోలీసుల నుండే తనను కాన్పూర్ లో ఎన్ కౌంటర్ కు చేయనున్నారని తనకు ముందుగానే సమాచారం అందిందని వికాస్ విచారణలో చెప్పడం ఇక్కడ ఆశ్చర్యకరం. ఈ సమాచారంతో అప్రమత్తమైన వికాస్ మరియు అతని అనుచరులు 8మంది పోలీసులను మట్టుబెట్టారు.
పోలీసుల హత్య తరువాత అందరి మృత దేహాలను తగలబెట్టాలని అతను భావించినట్లు చెప్పాడు. మృతదేహాలను దహనం చేయడానికి ఒకే చోటకు చేర్చి పెట్రోల్ తో అంటించేందుకు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. ఇక తనపైకి మరింత బలగం వస్తోందని మరలా సమాచారం అందుకున్న తర్వాతే ఆ పనిని అక్కడే ఆపివేసి పరారయ్యానని వెల్లడించాడు.
ఇకపోతే ఇతర పోలీసులతో సన్నిహితంగా ఉండటంపై అతను పట్టుకున్న పోలీసులు ప్రశ్నించగా అతను తనని కౌంటర్ చేస్తారన్న సమాచారం తనకి ఉదయమే అందిందని ఆ భయంతోనే అతను పోలీసులపై దాడికి దిగినట్లు చెప్పాడు. చివరికి వికాస్ కేసు ట్రయల్ కు కూడా వెల్లకుండానే పోలీసుల చేతిలో ఎన్ కౌంటర్ కావడం అది కూడా చాలా మందికి అనుమానస్పదంగా ఉండడంతో అసలు అతనికి పోలీసులకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని అందరిలో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.