ఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) డైరెక్టర్ అలోక్ వర్మపై శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. సిబిఐ డైరక్టర్ పదవి నుంచి ఆయనను హైపవర్ కమిటీ తొలగించిన తర్వాత ప్రభుత్వం వర్మను అగ్నిమాపక శాఖ డిజిగా బదిలీ చేసింది. ఆయిన అక్కడ బాధ్యతలు చేపట్టకుండా తనను రిటైర్ అయినట్లు పరిగణించాల్సిందిగా కోరారు. జనవరి 31వ తేదీన ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉండగా పదవ తేదీన తన సర్వీసుకు రాజీనామా చేశారు.
సిబిఐ డైరక్టర్ పదవిలో ఉన్నపుడు మాత్రమే తనకు సర్వీసు జనవరి 31 వరకూ ఉంటుందనీ, లేని పక్షంలో తాను ఎప్పుడో రిటైర్ అయిఉండేవాడినన్నది వర్మ వాదన. అయితే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆయన రాజీనామాను ఆమోదించలేదు. చివరి రోజైన జనవరి 31వ తేదీన అగ్నిమాపక శాఖలో బాధ్యతలు చేపట్టి పదవీ విరమణ చేయాలని సూచించింది. ఉన్నతాధికారుల ఉత్తర్వులను ధిక్కరించినందుకు గాను ఆయన పదవీ విరమణ ప్రయోజనాలను నిలుపుదల చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాల మధ్య వివాదం నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం ఇద్దరు అధికారులను బలవంతపు సెలవులపై పంపింది. తాత్కాలిక డైరెక్టర్గా ఎం నాగేశ్వరరావును నియమించింది.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులపై అలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం ధర్మాసనం కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేసింది. సుప్రీం కోర్టు ఉత్తర్వులతో అలోక్ వర్మ జనవరి ఎనిమిదవ తేదీ తిరిగి సిబిఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు.
అలోక్ వర్మ తిరిగి బాధ్యతలు స్వీకరించిన 24గంటల వ్యవధిలోనే ప్రధాని నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ సమావేశం అయి ఆయనపై పలు అభియోగాలు ఉన్నాయని పేర్కొంటూ సిబిఐ డైరెక్టర్ పదవి నుండి తప్పించారు. అగ్నిమాపక శాఖ డైరెక్టర్గా బదిలీ చేశారు.
నాడు అలోక్ వర్మను డైరెక్టర్ పదవి నుండి తొలగించే అంశంపై కమిటీలో సభ్యుడైన ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి సమావేశానికి సిజెఐ బదులు సభ్యుడుగా హజరైన సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఎ.కె. సిక్రి ప్రధాని మోది నిర్ణయాన్ని సమర్థించడంతో 2:1 మెజార్టీతో నిర్ణయాన్ని తీసుకున్నారు.
అగ్నిమాపక శాఖకు బదిలీ అయిన అలోక్ వర్మ అక్కడ బాధ్యతలు చేపట్టకుండా రాజీనామా చేయడంపై కేంద్రం ఆయనపై శాఖపరమైన చర్యలకు ఉపక్రమిస్తోంది.