దేశానికి రైతే వెన్నుముక అన్నారు పెద్దలు. నిజమే రైతు లేకపోతే దేశంలో తిండి దొరకదు. డబ్బులున్నా తిండి ఉండదు. అందుకే రైతుకు మనం ఎంతో విలువ ఇస్తాం. ఇప్పుడు మనం అసలు సిసలైన, నిఖార్సయిన రైతు గురించి తెలుసుకుందాం రండి.
ఇది ఇప్పటి స్టోరీ కాదు. 1960లోనే ప్రారంభం అయింది. జపాన్ లోని నరీటాలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కట్టడం కోసం అక్కడ ఉన్న భూములను తీసుకొని రైతులకు నష్టపరిహారం చెల్లించింది. అందరూ తమ స్థలాలను ఇచ్చారు కానీ.. ఒక్క వ్యక్తి మాత్రం ఇవ్వలేదు. ఎందుకు అంటే నా భూమిని మీకు ఇవ్వను. మా తరతరాల కుటుంబాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను కూడా ఇక్కడే ఉంటా.. అని చెప్పి నిరాకరించాడు.
అక్కడే వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. ఇంతలో అధికారులు కూడా ఆ వ్యక్తి పొలం పక్క నుంచే రన్ వేను వేశారు. కానీ.. ఆయన భూమిని ముట్టుకోలేదు. అలాగే ఆ వ్యక్తి కూడా తన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
కట్ చేస్తే ఇటీవల ఆ వ్యక్తి చనిపోయాడు. దీంతో తన బిజినెస్ ను వదిలేసి అతడి కొడుకు టకావ్ షిటో అదే ప్రాంతంలో వ్యవసాయం చేయడానికి వచ్చాడు. తండ్రి అంటే ఎలాగూ అక్కడి నుంచి కదల్లేదు. కనీసం కొడుకు అయినా కదులుతాడేమో చూద్దాం.. అని అధికారులు అతడిని కొనడానికి ప్రయత్నించారు. ఎయిర్ పోర్ట్ లో వ్యవసాయం చేయాల్సిన ఖర్మ నీకెందుకు. నీకు 12.75 కోట్లు ఇస్తాం. నువ్వు ఇంకో 150 సంవత్సరాలు వ్యవసాయం చేసినా ఇంత డబ్బు సంపాదించలేవు. ఆలోచించుకొని సమాధానం చెప్పు అని ఎయిర్ పోర్టు అధికారులు టకావ్ కు మంచి ఆఫర్ ఇచ్చారు.
అయినప్పటికీ… టకావ్ కూడా తన తండ్రిలాగానే డబ్బుకు లొంగలేదు. ఇది తరతరాల నుంచి మాకు వచ్చిన భూమి. దీన్ని వదులుకునేది లేదు. మా తండ్రి కూడా ఇక్కడే పుట్టాడు. ఇక్కడే పెరిగాడు. ఇక్కడే చనిపోయాడు. నేను కూడా అంతే. ఇక్కడే వ్యవసాయం చేస్తే. ఇక్కడి నుంచి ఇంచు కూడా కదలను.. అని అధికారులకు తెగేసి చెప్పేశాడు షిటో.