కరోనా వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. ఈ క్రమంలో భాగంగా వాక్సిన్ ప్రక్రియ అమలు కోసం ముందస్తుగా నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించేందుకు మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిలో భాగంగా ఈ నెల 28, 29 తేదీలలో ఆంధ్రప్రదేశ్ తో పాటు అసోం, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో డ్రైరన్ నిర్వహించనున్నారు.
డ్రైరన్ నిర్వహణకు ఏపిలో కృష్ణాజిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీంతో అధికారులు దీని కోసం క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు ప్రారంభించారు. ఈ నెల 28న కృష్ణాజిల్లాలో ఆరు ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ కు సిద్ధం కావాలని ఏఎన్ఎంలు, ఆశ వర్కర్ లు, వైద్యాధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో తొలి విడతగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా సమాచార సేకరణ చేయడంతో పాటు మౌలిక సదుపాయలను సమకూరుస్తున్నారు. తొలుత 3.6లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఏడు లక్షల మంది ఫ్రంట్ లైన్ సిబ్బందికి వ్యాక్సిన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భాగంగా వ్యాక్సినేషన్ కోసం 90వేల మంది ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్ లకు శిక్షణ ఇస్తున్నారు. మరో పక్క వ్యాక్సిన్ నిల్వ చేసేందుకు గానూ రెండు నుండి ఎనిమిది డిగ్రీల చల్లదనంతో ఉండేలా 4,065 కోల్డ్ చైన్ బాక్సులను, 29 రిఫ్రిజిరేషన్ వాహనాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ వచ్చిన వెంటనే విడదల వారీగా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.