ఏపిలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) దాఖలు చేసిన అప్పీల్ పై విచారణ నిర్వహించిన హైకోర్టు ధర్మాసనం రెండు రోజుల పాటు వాదనలు ముగియగా నిన్న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు నేడు కీలక తీర్పును ప్రకటించింది. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.
ఇటీవల ఎస్ఈసీ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించగా రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తున్నందున ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను రద్దు చేసింది.
దీనిపై ఎస్ఈసీ వేసిన రిట్ అప్పీల్ ను హైకోర్టు అనుమతించింది. వ్యాక్సినేషన్ కు ఎన్నికలు అడ్డుకాదని ఎస్ఈసీ తరపు న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. వ్యాక్సినేషన్, ఎన్నికల నిర్వహణ ఏకకాలంలో సాధ్యం కాదంటూ అడ్వొకేట్ జనరల్ శ్రీరాం కోర్టుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రజారోగ్యం, ఎన్నికలు రెండూ ముఖ్యమేనని హైకోర్టు పేర్కొంటూ సమన్వయంతో ముందుకు సాగాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు విడతల్లో పంచాయతీ ఎన్నికలకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల షెడ్యుల్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.