KCR : ప్రతి ఒక్కరూ తమ అభిమాన నేతలకు, స్నేహితులకు, బంధువులకు వారి పుట్టిన రోజు నాడు వివిధ రూపాల్లో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటారు. నేతల జన్మదినోత్సవాల సందర్భంలో బహుమతులు అందజేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే కొందరు ఇచ్చే బహుమతులు వారికి జీవిత కాలం గుర్తుండిపోయే విధంగా ఉంటాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్లకుంట్ల చంద్రశేఖరరావు (కేసిఆర్) బర్త్డే ఫిబ్రవరి 17న అన్నది అందరికీ తెలిసిందే. ప్రతి ఏటా ఆ పార్టీ శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు కెసిఆర్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటారు. అదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరి 17నాడు గంట వ్యవధిలో కోటి మొక్కలు నాటే కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ను అభిమానించే వారు ఆంధ్రా ప్రాంతంలోనూ ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా కడియంకు చెందిన పల్ల వెంకన్న నర్సరీ నిర్వహకులు కెసిఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రంగురంగుల పూలు, పూల మొక్కలతో కేసిఆర్ చిత్రపటాన్ని సృజనాత్మకంగా తీర్చిదిద్ది తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సశ్యశ్యామలం చేసేందుకు గానూ కేసిఆర్ ప్రారంభించిన హరితహారం కార్యక్రమం స్పూర్తితో తాము ఈ విధంగా వినూత్న రీతిలో శుభాకాంక్షల ఏర్పాటు చేశామని నర్సరీ నిర్వహకులు పల్ల సత్తిబాబు, పల్ల సుబ్రమణ్యం, పల్ల గణపతి లు తెలిపారు.
ఆంధ్రా ప్రాంతంలో తెలంగాణ సీఎం కేసిఆర్కు ఈ విధంగా వినూత్న రీతిలో జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం హైలెట్ గా మారింది. హాపీ బర్త్ డే సీఎం అంటూ పూలు, పూలమొక్కలతో రూపొందించిన ఈ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఇది చూసిన కేసిఆర్, టిఆర్ఎస్ శ్రేణులు ఫిదా అయ్యారట.