Utthar Pradesh Local Elections: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేక డీలాపడ్డ బీజేపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో అధికార పీఠానికి చేరువలేకపోయిన బీజేపీ అస్సాంలో మాత్రం అధికారం నిలుపుకోగలిగింది.పాండిచ్చేరిలో రంగస్వామి కూటమిలో భాగస్వామిగా చేరి అక్కడ పాగా వేసింది.అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ మ్యాజిక్ చేస్తుందని అందరూ ఆశించారు.ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో కమలనాథులు అధికారంలోకి వస్తారన్న అంచనాలు ఆకాశాన్ని అంటాయి.కానీ అది జరగలేదు.కేరళలో కూడా బీజేపీ ఏ అద్భుతాన్ని సృష్టించలేకపోయింది.తమిళనాడులో అన్నాడీఎంకే తో కలిసి పోటీ చేసి నష్టపోయింది.
మోడీ అమిత్ షాల కాంబినేషన్లో బీజేపీ భారతదేశం మొత్తాన్ని ఆక్రమించేస్తున్న సూచనలు కనిపించగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అది రివర్స్ అయ్యింది.ఈ షాక్ నుండి బిజెపి తేరుకోకముందే ఆ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్లో కూడా చేదు అనుభవం ఎదురయ్యింది. అక్కడా బీజేపీకి ఎదురుగాలి వీచింది
Utthar Pradesh Local Elections: యూపీలో కూడా ఎదురు గాలి!
తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బిజెపి ప్రతిపక్ష సమాజ్వాదీ పార్టీ కంటే వెనుకంజలో నిలిచింది. మొత్తం 3,050 స్థానాలకు గాను బీజేపీ మద్దతుదారులు కేవలం 599 స్థానాల్లోనే గెలిచారు. సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) 790, బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ)354 సీట్లల్లో పాగా వేశాయి. ఇక కాంగ్రెస్ పార్టీ 60 స్థానాల్లో జెండా ఎగురవేసింది. 1,247 స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
పీఎం, సీఎం నియోజకవర్గాల్లో కూడా!
ప్రధానమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ స్థానం వారణాసి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత జిల్లా గోరఖ్పూర్లోనూ బీజేపీని ప్రజలు తిరస్కరించడం గమనార్హం. కీలకమైన జిల్లాల్లో ఆ పార్టీ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయింది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. వైరస్ను కట్టడి చేయడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమయ్యిందన్న ఆరోపణలున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇకమీదట అయినా మేల్కోనకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.