ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గత ఏడాది డిసెంబర్లో `పుష్ప` సినిమాతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తే.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా చేశాడు.
పాన్ ఇండియా స్థాయి లో విడుదలైన ఈ చిత్రం.. అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. అలాగే బన్నీకి ఇండియా వైడ్ గా భారీ పాపులారిటీని తెచ్చి పెట్టింది. ప్రస్తుతం బన్నీ ఫోకస్ మొత్తాన్ని `పుష్ప 2`పై పెట్టాడు. అక్టోబర్ మొదటి వారం నుంచి అల్లు స్టూడియోలో ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించి.. రెండో వారంలో రెగ్యులర్ షూటింగ్ ను స్టార్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే బన్నీ తాజాగా ఓ తమిళ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఆ స్టార్ డైరెక్టర్ మరెవరో కాదు.. అట్లీ కుమార్. ఇప్పటికే ఆయన బన్నీకి కథ చెప్పారట. అట్లీ చెప్పిన కథ బాగా నచ్చడంతో.. బన్నీ వెంటనే సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు `పుష్ప 2` అనంతరం బన్నీ అట్లీతోనే సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ.. ఈ ప్రచారం పట్ల బన్నీ ఫ్యాన్స్ మాత్రం సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. కాగా, అట్లీ ప్రస్తుతం షారుక్ ఖాన్ తో `జవాన్` అనే సినిమా చేస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటిస్తోంది.