తమిళనాడులో రాష్ట్రంలోని బాణాసంచా కర్మాగారంలో ప్రమాదం సంభవించి ఆయిదుగురు మృతి చెందిన ఘటన మరువక ముందే ఏపిలోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం కడియద్దలో అదే రకమైన ప్రమాదం జరిగింది. ఇక్కడ జరిగిన ప్రమాదంలో నలుగురు కార్మికులు సజీవదహానం అయ్యారు. పలువురు గాయపడ్డారు. అన్నవరం అనే వ్యక్తికి చెందిన బాణ సంచా కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగింది. బాణాసంచా కర్మాగారం నుండి పెద్ద ఎత్తున పేలుడు శబ్దాలు వినబడటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురైయ్యారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక శకటాలతో ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
బాణాసంచా కర్మాగారంలో పేలుడు ఘటనపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర దిగ్బాంతిని వ్యక్తం చేశారు. బాధితులకు తగిన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షల వంతున సహాయం అందించాలని, బాదిత కుటుంబాలకు తోడుగా నిలవాలని సీఎం జగన్ ఆదేశించారు.