Pattikonda (Kurnool): కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. ఆనారోగ్యంతో మృతి చెందిన భర్తకు ఇంటి ఆవరణలోనే భార్య అట్టపెట్టలతో దహన సంస్కారాలు నిర్వహించింది. పత్తికొండ పట్టణంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనం కల్గించింది. వివరాల్లోకి వెళితే.. పత్తికొండ పట్టణానికి చెందిన పోతుగుంటి హరికృష్ణ ప్రసాద్ (60), లలిత దంపతులు తెరుబజారులో మెడికల్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉండగా, పెద్ద కుమారుడు దినేష్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పని చేస్తుండగా, రెండో కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు.
సోమవారం హరికృష్ణ ప్రసాద్ ఇంటిలో నుండి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు కంగారు పడ్డారు. వెంటనే సమాచారాన్ని పోలీసులకు అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంట్లోకి ప్రవేశించి ప్రసాద్ భార్య లలితను విచారించారు. లలిత చెప్పిన సమాధానంతో పోలీసులు అవాక్కయ్యారు. తన భర్త కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారనీ, అకస్మాత్తుగా సోమవారం ఉదయం చనిపోయాడని తెలిపింది. తమ కుమారులు కొంత కాలంగా తమను సరిగా చూసుకోవడం లేదనీ, కేవలం తమ వద్ద ఉన్న ఆస్తి కోసమే వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి మరణ వార్త తెలిస్తే ఇంటికి వచ్చి ఆస్తి కోసం గొడవ చేస్తారని, తానే అట్టపెట్టెలు వేసి తగలబెట్టి రహస్యంగా దహన సంస్కారాలు పూర్తి చేసినట్లు పోలీసులకు తెలియజేసింది.