Gannavaram: కేడీసీసీ మాజీ చైర్మన్, గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడలో తన అనుచరులతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. నియోజకవర్గంలో తన అభిమానులు, కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న అనంతరం వైసీపీని వీడాలని నిర్ణయంచుకున్నట్లు తెలిపారు. టీడీపీలో చేరేందుకు పార్టీ అధినేత చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానన్నారు. గన్నవరం అభ్యర్ధిగా తాను పనికి వస్తానని భావిస్తే టికెట్ ఇవ్వాలని కోరారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గన్నవరం టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా గెలిచి కానుకగా ఇస్తానని, జగన్ ను అసెంబ్లీలోనే కలుస్తానని యార్లగడ్డ వ్యాఖ్యానించారు.
తనకు అమెరికాలో 2005లోనే గ్రీన్ కార్డు వచ్చినా రాజకీయాలపై ఇష్టంతో జిల్లాకు వచ్చి గన్నవరం నుండి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేశానన్నారు. గన్నవరం లో ఇంటింటికి తిరిగి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తే ఇప్పుడు అవమానకరంగా మాట్లాడారని అన్నారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో తనకు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానాన్ని కోరితే .. వారికి ఏమి అర్ధం అయ్యిందో ఏమో కానీ ఉండాలనుకుంటే ఉండు లేకపోతే వెళ్లిపో అన్నట్లుగా సజ్జల మాట్లాడినట్లు తెలిసిందన్నారు. తడిగుడ్డతో గొంతు కోయడం తన విషయంలో జరిగినట్లు కనబడుతోందని వ్యాఖ్యానించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉంచే ఇలా జరిగేది కాదని నియోజకవర్గంలోని నేతలు అంటున్నారన్నారు.
ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో తాను చంద్రబాబు, నారా లోకేష్, దేవినేని ఉమా తదితర టీడీపీ నేతలను కలవలేదని, కలిసినట్లుగా ఎవరైనా రుజువు చేస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేశారన్నారు. తాను గన్నవరంలో ఓడిపోయినా కార్యకర్తలు తన తోనే ఉన్నారని, తనతో పని చేసిన వారికి పదవులు కూడా రాలేదని అన్నారు. కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. టీడీపీకి కంచుకోట లాంటి గన్నవరంలో వైసీపీ బలోపేతం కోసం కృషి చేసినందుకు ఇలాంటి దుస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. తనకు అపాయింట్మెంట్ లేదా టికెట్ ఇవ్వని సీఎం జగన్ కు ధన్యావాదులు చెబుతున్నానన్నారు యార్లగడ్డ.
కాగా, యార్లగడ్డ వైసీపీకి గుడ్ బై చెప్పడంతో నారా లోకేష్ పాదయత్రలో టీడీపీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నెల 19వ తేదీ లోకేష్ యువగళం పాదయాత్ర జిల్లాలో ప్రవేశించనున్నది.
మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత