Lokesh Yuvagalam Padayatra: రాష్ట్రంలో వైసీపీ గాలిలోనూ ముగ్గురు నేతలు ఎంపీలుగా గెలిచారు. విజయవాడ నుండి కేశినేని నాని, గుంటూరు నుండి గల్లా జయదేవ్, శ్రీకాకుళం నుండి కింజారపు రామ్మోహన్ నాయుడు విజయం సాధించారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర్ రాజా ఫ్యాక్టరీ పై అధికారులు తనిఖీలు నిర్వహించడం, నోటీసులు జారీ చేయడం వంటివి జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించడంతో గల్లా జయదేవ్ రాజకీయంగా సైలెంట్ అయ్యారు. టీడీపీకి దూరంగా ఉంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి వైసీపీ లో చేరే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే తనిఖీల పేరుతో వేధింపులకు గురి చేస్తుండటంతో తన ట్రావెల్స్ కార్యకలాపాలనే మూసివేశారు. అయితే వీరు ఇద్దరు ఈ ఏడాది టీడీపీ మహానాడు కు గైర్హజరు అయ్యారు.
కేశినేని నాని అయితే తన నియోజకవర్గ పరిధిలో నిధులను మంజూరు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొంటున్నారు. వ్యక్తిగతంగా తన ట్రస్ట్ ద్వారానూ సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. అయితే పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యేలతోనూ సన్నిహితంగా ఉంటూ వారి అభ్యర్ధనతో తన నియోజకవర్గ అభివృద్ధి నిధులను విడుదల చేస్తున్నారు. తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలన్న తలంపుతో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో తనను వ్యతిరేకించే వాళ్లను కలుపుకుని కార్యక్రమాలు చేస్తున్నప్పటి నుండి కేశినేని నాని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పలు సందర్భాల్లో పార్టీపై, సొంత పార్టీ నాయకులపై సంచలన కామెంట్స్ కూడా చేశారు. పార్టీ కూడా చిన్నని ప్రోత్సహిస్తుండం, తనను వ్యతిరేకించే పలువురు నియోజకవర్గ ఇన్ చార్జిలు ఆయనకు అనుకూలంగా ఉండటంతో నాని గుర్రుగా ఉన్నారు.
పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పలువురు నేతలతో విభేదాలు ఉన్నా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా చంద్రబాబుతో మాత్రం బాగానే ఉంటున్నారు. పుంగనూరు ఘటన పై ఘాటుగానే స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగానే విమర్శించారు. అయితే నారా లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు జిల్లా ప్రవేశించనంత వరకూ ఆయా జిల్లాలో పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జ్ లు పర్యవేక్షించగా, గుంటూరు జిల్లాలో గల్లా జయదేవ్, ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ ఎంపీ కేశినేని నాని అసలు లోకేష్ పాదయాత్రకే దూరంగా ఉన్నారు.
ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుండగా, కేశినేని చిన్ని, కొనకళ్ల నారాయణ మెజార్టీ బాధ్యతలను చేపట్టినట్లుగా సమాచారం. ప్రకాశం బ్యారేజ్ నుండి జిల్లాలోకి ప్రవేశించిన నారా లోకేష్ కు దేవినేని ఉమా, బొండా ఉమా, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్, బుద్దా వెంకన్న వివిధ నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జిలు పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. విజయవాడలో జరుగుతున్న పాదయాత్రలో నేతలు ఆయన వెంట నడుస్తున్నారు. వంగవీటి రాధా సైతం లోకేశ్ కు స్వాగతం పలికి పాదయాత్రలో పాల్గొన్నారు. కానీ విజయవాడలో కేశినేని నాని పాల్గొనలేదు. ఆయన కుమార్తె స్వేత కూడా పాదయాత్రలో కనబడలేదు. రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయ్యింది.