YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవేళ విజయవాడలో పర్యటించారు. మైనారిటీస్ వెల్పేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలలో సీఎం వైయస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లడుతూ..మైనార్టీలకు ప్రభుత్వం పెద్ద పీట వేసిందని, గతానికి ఇప్పటికీ మధ్య తేడాలు గమనించాలన్నారు. గత ప్రభుత్వంలో మైనార్టీలను టీడీపీ గాలికి వదిలివేసిందని విమర్శించారు.
పేద ముస్లింల కోసం దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత మహానేత వైయస్ఆర్ గారిది అని చెప్పడానికి సంతోషంగా ఉందన్నారు. ఆయన బిడ్డగా 2019 నుంచి రాష్ట్రంలో మైనార్టీల సంక్షేమం కోసం అనేక గొప్ప మార్పులు తీసుకురావడం జరిగిందన్నారు. సాధికారత మాటల్లో కాదు.. చేతల్లో మన ప్రభుత్వం చుపిందన్నారు. వైఎస్ఆర్ పార్టీ నుంచి నలుగురు ముస్లింలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నామని గుర్తు చేశారు. 53 నెలల కాలంలో మరో నలుగురిని ఎమ్మెల్సీలుగా కూర్చోబెట్టుకున్నామని, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా తొలిసారిగా ముస్లిం సోదరి శాసన మండలి ఉపాధ్యక్ష పదవిలో ఉన్నారన్నారు. ఇదీ ముస్లింలకు మీ బిడ్డ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత అని అన్నారు.
మంత్రివర్గంలో మైనార్టీలకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి గౌరవించిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు సీఎం జగన్. అన్ని రంగాల్లో మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. లంచాలు, వివక్షకు తావు లేకుండా పాలన కొనసాగిస్తున్నామన్నారు. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన బలం అని అన్నారు. ప్రతి పేదవాడి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం పని చేస్తొందని పేర్కొన్నారు. ఈ ప్రభుత్వం ఒక్క జగన్ దే కాదనీ, మనందరిది అని అన్నారు. ప్రతి అడుగులోనూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను కలుపుకుని వెళుతున్నామన్నారు.
వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా 2.5 లక్షల కోట్లకుపైగా నగదును అందజేశామని అన్నారు. చంద్రబాబు హయాంలో మైనార్టీ సంక్షేమానికి కేవలం 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన ప్రభుత్వంలో రూ.23వేల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు. విజయవాడ నుండి హజ్ యాత్రకు వెళ్లే అవకాశం కల్పించామనీ, వారికి అదనపు భారం పడకుండా రూ.14 కోట్లు ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇమాం, మౌజం లకు గౌరవ వేతనం అందిస్తున్నామని సీఎం జగన్ తెలిపారు.