CPI Narayana: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సంచలన కామెంట్స్ చేశారు. అందరికీ సన్ స్ట్రోక్ ఉంటే .. కేసిఆర్ కు మాత్రం డాటర్ స్ట్రోక్ తగిలింది అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బాలపేటలో నిర్వహించిన బహిరంగ సభలో నారాయణ పాల్గొని ప్రసంగించారు. లిక్కర్ స్కామ్ కారణంగానే బీజేపీకి కేసిఆర్ తలొగ్గారని అన్నారు.
తుమ్మలను ఉద్దేశించి కేసిఆర్ తుమ్మ ముళ్లు వ్యాఖ్యాలు చేశారనీ కానీ తుమ్మల తులసి మొక్క లాంటి వారని అన్నారు. ఖమ్మంలో పోటీ తులసి మొక్కకు గంజాయి మొక్క మధ్య అంటూ వ్యాఖ్యానించారు. పువ్వాడ అజయ్ గంజాయి మొక్క లాంటోడని అన్నారు. పువ్వాడ అజయ్ కు సీపీఐ ఓట్లు వేయదని అందుకు తనది గ్యారంటీ అని పేర్కొన్నారు. తుమ్మల నలభై ఏళ్లుగా పరిచయం ఉందని చెప్పారు. కాళేశ్వరం మునిగిందని కల్వకుంట్ల కుటుంబం ఖజానా నిండిందని విమర్శించారు. దళిత బంధు పై రాజకీయం తప్ప రైతులపై ప్రేమ కాదని అన్నారు.
కేసిఆర్ పాలనపై యువత, మహిళలు, రైతులు వ్యతిరేకంగా ఉన్నారని నారాయణ అన్నారు. అహంభావంలో నెంబర్ వన్ కేసిఆర్.. నెంబర్ టూ కేటిఆర్.. నెంబర్ త్రీ పువ్వాడ అజయ్ అని అన్నారు. కేసిఆర్ నిరాహార దీక్ష నిజమైందని కాదనీ, చావు లేకుండా మందులు ఇచ్చారని అన్నారు. ప్రశ్నించే గొంతులు నొక్కే కేసిఆర్ పాలన తరిమికొట్టాలని అన్నారు. కేసిఆర్ ఓడిపోవడం ఖాయం, ఇక ఫార్మ్ హౌస్ కే పరిమితం ఖయమని అన్నారు. కేసిఆర్ పాలనపై ఎన్నికల సమయంలో బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తుంది కానీ పదేళ్లుగా కేసిఆర్ ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు నారాయణ.
మోడీ, కేసిఆర్, జగన్ ముగ్గురూ తోడుదొంగలేనని విమర్శించారు. తెలంగాణ వచ్చే వరకూ పక్కన ఉన్న కోదండరామ్ ను తర్వాత కేసిఆర్ పక్కన పెట్టారన్నారు. దేశంలోఎక్కడా లేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగినట్లే కేసిఆర్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిలో సీపీఐ, సీపీఎం భాగస్వాములుగా ఉన్నామనీ, ఒక్క సీటా రెండు సీట్లా అనేది కాదనీ, బీజేపీ, బీఆర్ఎస్ ను అడ్డుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కు చెంప పెట్టు అని సీపీఐ నేత నారాయణ అన్నారు.