US Student Visa new rules: నాణ్యమైన విద్యతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న కారణంగా ప్రతి ఏటా అనేక దేశాలకు చెందిన విద్యార్ధులు అమెరికాకు తరలి వెళుతుంటారు. అయితే, అమెరికా ప్రభుత్వం ప్రతిభావంతులకే తమ విద్యాసంస్థల్లో అవకాశం కల్పిస్తూ ఉంటుంది. ప్రతి ఏటా భారత్ నుండి పెద్ద సంఖ్యలో విద్యార్ధులు అమెరికా వెళుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది అమెరికా ఎంబసీ రికార్డు స్థాయిలో భారతీయుల వీసాలను ప్రాసెస్ చేసింది.
వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్ మెంట్ సిస్టమ్ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు యూఎస్ ఎంబసీ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మార్పులు సోమవారం (నవంబర్ 27) నుండి అమల్లోకి వచ్చాయి. ఎం, ఎఫ్, జే కేటగిరీ వీసాల కోసం ధరఖాస్తు చేసుకునే వారు మారిన నిబంధనలను గుర్తుంచుకోవాలని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.
న్యూ రూల్స్ ఇవే
- స్టూడెంట్ వీసా కోరుకునే అభ్యర్ధులు అధికారిక వెబ్ సైట్ లో తమ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే సమయంలో, అపాయింట్ మెంట్ బుక్ చేసుకునే సమయంలో కొత్త పాస్ పోర్టులో ఉన్న సమాచారాన్నే పొందుపర్చాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారం ఇస్తే వారి ధరఖాస్తులను తిరస్కరించడంతో పాటు వారి అపాయింట్ మెంట్ రద్దవ్వడమే కాకుండా వీసా ఫీజులు కూడా కోల్పోవాల్సి ఉంటుంది.
- తప్పుడు పాస్ పోర్టు నంబర్ తో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వారు .. మళ్లీ సరైన నంబర్ తో కొత్త ప్రాఫైల్ ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్ మెంట్ కోసం బుక్ చేసుకోవాలి. ఇందు కోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది.
- ఒక వేళ పాస్ పోర్టు పోయినా, చోరీకి గురైనా కొత్త పాస్ పోర్టు తీసుకున్న వారు, పాస్పోర్టును రెన్యువల్ చేయించుకున్న వారు పాత పాస్ పోర్టుకు సంబంధించిన ఫోటో కాపీని, ఇతర పత్రాలను అప్లికేషన్ తో పాటు సమర్పించాలి. అప్పుడే వారి అపాయింట్ మెంట్ ప్రక్రియ కు అనుమతి లభిస్తుంది.
- ఎమ్, ఎఫ్ కేటగిరీ వీసాల కోసం ధరఖాస్తు చేసుకున్న వారు స్టూడెంట్ అండ్ ఎక్సేంజ్ విజిటర్ ప్రొగ్రామ్ దృవీకరించిన స్కూల్ లేదా ప్రొగ్రామ్ లో పేర్లు నమోదు చేసుకోవడం తప్పనిసరి. జే కేటగిరీ వీసాల కోసం అర్జీ చేసుకునే వారికి అమెరికా విదేశాంగ శాఖ అనుమతి ఉన్న సంస్థ నుండి స్పాన్సర్ షిప్ తప్పనిసరి.
విద్యార్ధి వీసా కోసం అర్జీ చేసుకోవాలని భావిస్తున్న వారు ఈ మార్పులను తప్పనిసరిగా గమనించాలని అమెరికా రాయబార కార్యాలయం సూచించింది. వీసా అంశాల్లో మోసాలు, ఆపాయింట్మెంట్ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని కట్టడి చేసేందుకే నిబంధనలు మార్చినట్లు గా వెల్లడించింది.
YS Jagan: డిసెంబర్ 15 నుండి ఏపీలో ‘ఆడుదాం – ఆంధ్రా’ క్రీడా సంరంభం ..క్రీడాకారుల రిజిస్ట్రేషన్ ఇలా..