Chandrababu: స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు మంగళవారం జస్టిల్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు నిర్దేశించిన కొలమానాలను హైకోర్టు అతిక్రమించిందని ఏపీ సర్కార్ పేర్కొంది. కేసు లోతుల్లోకి వెళ్లి క్లీన్ ఇచ్చే ప్రయత్నం చేసిందని, ట్రయల్ కోర్టును ప్రభావితం చేసేలా హైకోర్టు తీర్పు ఉందని తెలిపింది. మినీ ట్రయల్ నిర్వహించి 39 పేజీల తీర్పు ఇందుకు నిదర్శనంగా పేర్కొంది. దుర్వినియోగం చేసిన నిధులు టీడీపీ ఖాతాల్లోకి వెళ్లాయనీ, అందుకు పూర్తి అధారాలు ఉన్నా ఏ మాత్రం పట్టించుకోలేదని తెలిపింది.
చంద్రబాబుకు రాజకీయ పలుకుబడి ఉందనీ, సాక్ష్యులను బెదిరించడం ద్వారా దర్యాప్తును ప్రభావితం చేస్తారని, కావున చంద్రబాబుకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ప్రభుత్వం కోరింది. సీఐడీ, ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాదులు రంజిత్ కుమార్, ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. స్కిల్ కేసులో క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాత బెయిల్ రద్దు పిటిషన్ పై వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేస్తూ ఈ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు ఆదేశించింది. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.
మధ్యంతర బెయిల్ సమయంలో ఇచ్చిన కండిషన్లు అమలు అయ్యేలా ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను ధర్మాసనం తోసిపుచ్చింది. సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించుకోవచ్చనీ, అయితే స్కిల్ కేసు గురించి చంద్రబాబు మీడియాలో గానీ బహిరంగంగా గానీ మాట్లాడకూడదని తెలిపింది. ఇరుపక్షాలు స్కిల్ కేసు గురించి బహిరంగంగా మాట్లాడవద్దని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.
CPI Narayana: సీఎం కేసిఆర్ పై సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు