Chandrababu: తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి రాయపాటి రంగారావు రాజీనామా చేశారు. ఆయన కొంత కాలంగా పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రాయపాటి రంగారావు సత్తెనపల్లి అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే బీజేపీ నుండి టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి ఇన్ చార్జిగా నియమించారు చంద్రబాబు.
ఇక నరసరావుపేట లోక్ సభ స్థానాన్ని కూడా బీసీలకు కేటాయించాలని టీడీపీ నిర్ణయించినట్లు తెలియడంతో రాయపాటి రంగారావు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. రాయపాటి సాంబశివరావు గత కొంత కాలం క్రితం చంద్రబాబును కలిసి తమ కుటుంబానికి రెండు టికెట్లు కావాలని కోరారు. ఇప్పుడు ఒక్క స్థానం కూడా ఇచ్చే పరిస్థితి కనబడకపోవడంతో ఆయన కుటుంబం పార్టీకి గుడ్ బై చెప్పింది.
చంద్రబాబుపై రంగారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ తన కార్యాలయంలోని చంద్రబాబు ఫోటోను నేలకేసి కొట్టారు. ఈ సందర్భంలో చంద్రబాబు, టీడీపీ పై తీవ్ర ఆరోపణలు, వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, లోకేష్ దనదాహానికి తమ కుటుంబం సర్వనాశనం అయిపోయిందని మండిపడ్డారు. వారిద్దరికి డబ్బే ముఖ్యమని, మరేమి అవసరం లేదని అన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన తాము పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశామని చెప్పారు.
గత ఎన్నికలకు ముందు తమ నుండి రూ.150 కోట్లు తీసుకున్నారని తెలిపారు. లోకేష్, చంద్రబాబు ఎంతెంత తీసుకున్నారో తమ వద్ద లెక్కలు ఉన్నాయని, తండ్రీ కొడుకులు ఒకరికి తెలియకుండా మరొకరు డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. డబ్బులు తీసుకుని కూడా పోలవరం ప్రాజెక్టు విషయంలో తమకు సర్వనాశనం చేశారన్నారు. చంద్రబాబు కమీషన్ల కోసం పోలవరాన్ని వాడుకున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టు 75 శాతం పూర్తి చేసినట్లుగా చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్దమని అన్నారు.
సీఎం జగన్ పేదల కోసం పని చేస్తున్నారని రంగారావు అన్నారు. జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని అన్నారు. జగన్ అంటే తమకు ఇష్టమని, ఆయన సీటు ఇస్తే పోటీ చేస్తానని రంగారావు తెలిపారు. టీడీపీ రాజకీయ పార్టీయే కాదు. ఫక్తు వ్యాపార సంస్థ అని రంగారావు దుయ్యబట్టారు. మంగళగిరిలో నారా లోకేష్ ను ఓడిస్తామని తెలిపారు. గతంలో కొండ్రు కమల, మురుగుడు హనుమంతరావులను తామే గెలిపించుకున్నామని తెలిపారు.
సత్తెనపల్లి సీటును తమకు కాకుండా చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు ఇవ్వడంతో 83 ఏళ్ల తన తండ్రి రాయపాటి సాంబశివరావు ఆవేదన చెందారన్నారు. 2014 లో రాయపాటి సాంబశివరావు ఎంపీగా గెలిచాక కూడా టీడీపీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నారని తెలిపారు. రాయపాటి చేసిన ఆరోపణలు, వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.