EC: కేంద్ర ఎన్నికల కమిషనర్ల నియామకంపై నేడు సమావేశం జరగనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదురి, న్యాయశాఖ మంత్రి రామ్ మేఘ్ వాల్ లు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎన్నికల కమిషనర్ ఒక్కరు మాత్రమే ఉన్నారు.
ఎన్నికల కమిషనర్ అనూప్ పాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయగా, మరో కమిషనర్ అరుణ్ గోయల్ వ్యక్తిగత కారణాల రీత్యా ఇటీవల రాజీనామా చేశారు. దీంతో ఖాళీ అయిన ఇద్దరు కమిషనర్ల ను ఎంపిక చేసేందుకు ఈ సమావేశం జరగనుంది. త్వరలో ఎన్నికల షెడ్యుల్ విడుదల కానుండటంతో వీరి నియామకం త్వరగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరో పక్క సీజేఐ లేకుండా సీఈసీ, ఈసీ నియామకాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్ తేలే వరకూ 2023 మార్చి 2న సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఈసీలో ఖాళీలను భర్తీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) కోరింది. ఈసీల నియామక కమిటీ నుండి సీజేఐ ని మినహాయించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో బుధవారం పిటిషన్ దాఖలైంది.
ఆరోగ్యకర ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే సీఈసీ, ఈసీ నియామకాల్లో రాజకీయ ప్రమేయం, కార్యనిర్వహక వ్యవస్థ జోక్యం లేకుండా చూడాల్సిన అవసరం ఉందని డీఆర్ తరపు న్యాయవాది ప్రశాంత్ భూషన్ నివేదించారు. అత్యవసరంగా పిటిషన్ ను విచారించాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనాన్ని కోరారు. దీనికి ధర్మాసనం అంగీకరిస్తూ శుక్రవారం విచారణ చేపడతామని ప్రకటించింది.
ఈ పిటిషన్ రేపు విచారణకు రానున్న తరుణంలో ఇవేళ ప్రధాని మోడీ అధ్వర్యంలో జరుగుతున్న సమావేశం కీలకంగా మారనుంది. ప్రధాని నేతృత్వంలోని కమిటీ సిఫార్సుల ఆధారంగా ఇద్దరికిని రాష్ట్రపతి నియమిస్తారు. కొత్త చట్టం ప్రకారం జరిగిన తొలి నియామకాలు ఇవే అవుతాయి. అయితే రేపు సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
TDP: టీడీపీ సెకండ్ లిస్ట్ ఫైనల్ చేసిన చంద్రబాబు .. జాబితా విడుదల ఎప్పుడంటే..?