సీఎం రమేష్.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ సభ్యుడు. ఈయన ఈ ఏడాది ఏప్రిల్ వరకు పదవిలో ఉంటారు. ప్రస్తుత ఎన్నికల్లో ఆయన పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆయన టికెట్ విషయం కూడా చర్చకు వచ్చింది. విశాఖ , లేదా అనకాపల్లి నుంచి ఆయన పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే.. ఇంతలోనే బాంబులాంటి వార్త బయటకు వచ్చింది. అదే ఎలక్టోరల్ బాండ్. తాజాగా ఎస్బీఐ బ్యాంకు వెల్లడించిన వివరాలు సీఎం రమేష్ చుట్టూ ఉచ్చు అలుముకునేలా చేశాయి. దీంతో ఆయన టికెట్ పై ప్రభావం చూపించడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
ఏం జరిగింది..
గతంలో టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేష్ 2019 తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఎంపీగానే కొనసాగుతు న్నారు. అయితే.. ఇప్పుడు వెలువడిన ఎలక్టోరల్ బాండ్లలో ఆయన కాంగ్రెస్కు ఏకంగా 30 కోట్ల రూపాయల విరాళం ఇచ్చినట్టు తేలింది. తన సొంత సంస్థం రిత్విక్ ప్రాజెక్ట్స్ పేరుతో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీలో పలు ప్రాజెక్టులు చేపట్టారు. ఏపీ కన్నా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువ పనులు చేపడుతూ ఉంటారు. ఇదిలావుంటే, బీజేపీకి బద్ధ శత్రువైన కాంగ్రెస్కు ఆయన విరాళం ఇవ్వడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వాస్తవానికి బీజేపీ ఎంపీలు ఎవరూ కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి విరాళం ఇవ్వరు.
కానీ, సీఎం రమేష్ ఇచ్చారు. తన రిత్విక్ ప్రాజెక్ట్స్ సంస్థ పేరుతోనే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి 30 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు . వాటిని కాంగ్రెస్ ఎన్ క్యాష్ చేసుకుంది. అలాగే మరో కర్ణాటక పార్టీ అయిన జేడీఎస్ కు కూడా పది కోట్ల రూపాయలను ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చారు. ఇక తెలుగుదేశం పార్టీకి 5 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. సీఎ రమేష్ .. వ్యాపారవేత్త. ఆయన అన్ని ప్రభుత్వాలతోనూ ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలకు ఆయన వివరాళివ్వడం ఆశ్చర్యకరంగా మారింది.
బీజేపీలో ఇప్పుడు హాట్ హాట్గా మారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఏపీలో టీడీపీ, జనసేనలతో కలిసేలా బీజేపీ అగ్రనాయక త్వాన్ని ఒప్పించడం వెనుక సీఎం రమేష్ కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. ఇప్పుడు ఆయన అనకాపల్లి నుంచి ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ బాండ్ల వివరాలు బయటకు రావడంతో ఆయన కు టిక్కెట్ ఇవ్వడంపై పార్టీ హైకమాండ్ పునరాలోచన చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీలోనూ ఆయన ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.