అమరావతి : వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన రూ.10 వేలను ఆటో డ్రైవర్ లు వాహనం ఇన్సూరెన్సు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) కోసం ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. రెండవ విడత వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. నేరుగా రూ.262.49 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. ఆటో, ట్యాక్సీ ఉన్న 2,62,493 మంది లబ్దిదారులకు రెండవ విడతగా రూ.10వేలు చొప్పున ఆర్ధిక సాయం అందనుంది.
ఈ సందర్బంగా ఆటో, ట్యాక్సీ కార్మికులను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడారు. డ్రైవర్లను నమ్మి ప్రయాణికులు వాహనం ఎక్కుతారనీ, డ్రైవర్లు వాహనాల ఫిట్నెస్ సర్టిఫికేట్లు ఉంచుకోవాలనీ అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలనీ, మద్యం సేవించి వాహనాలు నడప వద్దనీ ముఖ్యమంత్రి జగన్ కోరారు. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద ఎక్కడైనా, ఎవరికైనా అర్హత ఉండి.. రూ.10 వేలు అందకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, డ్రైవర్లు నేరుగా గ్రామ, వార్డు సచివాలయంలో.. యాప్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అర్హులని తేలితే వచ్చే నెల 4న డబ్బు జమ చేస్తామన్నారు. వాహన మిత్ర పథకాన్ని పూర్తి పారదర్శకత, అవినీతికి తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి.
గత ఏడాది కంటే అదనంగా 37,756 మంది లబ్ధిదారులను రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్లో రూ.పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాల నేపధ్యంలో నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్న వారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గత ఏడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు.