AP BJP : ఏపి బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజును మార్చే అవకాశాలు ఉన్నాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. సోము వీర్రాజు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ఆయన ఏమి మాట్లాడుతున్నారో అధికార, ప్రతిపక్ష పార్టీలపై ఆయన స్టాండ్ ఏమిటో అర్థం కాకుండా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఆ తరువాత తాను అలా అనలేదు అంటూ సోము వీర్రాజు ఖండించిన సందర్భాలు ఉన్నాయి. పార్టీలో సోము వ్యతిరేక వర్గం పలు మార్లు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఆయన వ్యవహార శైలిపై ఫిర్యాదులు కూడా చేశాయంటున్నారు. అయితే సోము మార్పు అంశంపై సోషల్ మీడియా వస్తున్న కథనాల్లో నిజం ఉందో లేదో తెలియదు కానీ ఆ వార్తలు నమ్మి ఆ సీటు కోసం ఆశ పడిన ఓ నేతపై పార్టీ నుండి వేటు పడటం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైన నాటి నుండి కొన్ని విషయాల్లో గత నాయకులకు బిన్నంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ స్టాండ్ కు బిన్నంగా ఎవరు మాట్లాడినా వారిపై తక్షణం వేటు వేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు నేతలను పార్టీ నుండి బహిష్కరించారు. మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గంగా ముద్ర పడిన వారిని పక్కన పెట్టారన్న వార్తలు వచ్చాయి. ఇదిలా ఉండగా విజయనగరం జిల్లా కు చెెందిన ఆ పార్టీ రాష్ట్ర మాజీ కోశాధికారి పాకలపాటి సన్యాసిరాజుకు రాష్ట్ర పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలన్న ఆశ పుట్టింది. అనుకున్నదే తడవుగా పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ రాశారు. తాను గతంలో జిల్లా, రాష్ట్ర స్థాయి పదవులు నిర్వహించి ఉన్నాననీ, రాష్ట్రంలో పార్టీ అధ్యక్షుడి మార్పు ఉంటే తనకు అవకాసం కల్పించాలంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాకు లేఖ రాశారు. ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారు. దీంతో విజయనగరం జిల్లా బీజేపీ శాఖ సన్యాసిరాజు పార్టీ క్రమశిక్షణ మీరారంటూ బహిష్కరణ వేటు వేసింది. సన్యాసిరాజుపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర కమిటికి విజ్ఞప్తి చేస్తూ జిల్లా బీజేపీ శాఖ తీర్మానించింది.