AP CID Case: వైసీపీ రెబల్ ఎంపి రఘురామ కృష్ణం రాజు పేరు చెబితేనే ఆ పార్టీలోని నాయకులు అందరికీ కోపం రగిలిపోతుంది. వైసీపీ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిపై రఘురామ కృష్ణం రాజు నెలలు తరబడి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. వైసీపీ గ్రామ స్థాయి నాయకుడి నుండి పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు మొదలు కొని మంత్రుల వరకూ రఘురామ పేరు చెబితే తీవ్ర స్థాయిలో మండిపడతారు. ఇటీవల ఏపీ సీఐడి ఆయనను రాజద్రోహం, తదితర సెక్షన్ల కింద అరెస్టు చేయడంతో ఆ పార్టీ నేతలు, సానుభూతి పరులు, అభిమానులు ఏంతో సంతోషించారు. ఇన్నాళ్లకు పాపం పండింది, జైలు ఊచలు లెక్క పెట్టించేశారు జగన్ అంటూ తెగ సంబరపడ్డారు.
అయితే రఘురామ జైలులో ఒక రోజు మాత్రమే ఉండి ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లడం, సుప్రీం కోర్టులో బెయిల్ మంజూరు కావడం జరిగిపోయాయి. రాజద్రోహం కేసులో కనీసం పది పదిహేను రోజులు అయినా జైలు జీవితం గడపకుండా రఘురామ కృష్ణం రాజు సుప్రీం కోర్టు నుండి బెయిల్ ద్వారా బయటకు వచ్చారంటే విశేషమే మరి. కానీ ఇక్కడ ఓ ట్విస్ట్ ఉంది. రఘురామకు బెయిల్ ఇప్పించింది ఎవరో తెలిస్తే వైసీపీ వర్గీయులు ఒక్క సారిగా షాక్ అవుతారు. ఎందుకంటే రఘురామ తరపున సుప్రీం కోర్టులో వాదనలు వినిపించింది సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కావడం గమనార్హం. ఈ న్యాయవాదే ఏపి ప్రభుత్వానికి సంబంధించి పలు కీలక కేసులను వాదిస్తున్నారు.
ఏపి రాజధానుల కేసుతో పాటు విశాఖ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన కేసుల్లో జగన్ సర్కార్ తరపున ముకుల్ రోహత్గీనే వాదనలు వినిపిస్తున్నారు. గత ఏడాది రోహత్గీకి ఫీజు చెల్లింపులకు సంబంధించి జగన్ ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయిస్తూ జీవో కూడా విడుదల చేసింది. ఓ రకంగా చెప్పాలంటే జగన్ సర్కార్కు ఆస్థాన న్యాయవాది అయిన రోహత్గీ .. రఘురామకు బెయిల్ రావడానికి కారణం అయ్యారని తెలియడం వైసీపీ వర్గీయులను నిరుత్సాహానికి గురి చేస్తోంది. అయితే ఈ విషయంలో రోహత్గీని ఎవరూ తప్పుబట్టడానికీ వీలులేదు. ఎందుకంటే తన క్లైయింట్ కు న్యాయం జరగడం కోసం వృత్తి ధర్మాన్ని ఆయన నిర్వర్తించారు.