ఏపి ప్రభుత్వానికి హైకోర్టు మరో షాకింగ్ ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో సీనియర్ రెసిడెన్సి పోస్టుల నియామకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ను హైకోర్టు తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సీనియర్ రెసిడెన్సి పోస్టుల భర్తీ నియామకానికి సంబంధించి ప్రైవేటు కళాశాల విద్యర్ధులను అనుమతించకపోవడంపై హైకోర్టులో కర్నూలుకు చెందిన డాక్టర్ ఝాన్సీ రాణి తదితరులు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారించారు. పిటిషన్ల తరపున న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు.
ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వైద్యులు మాత్రమే ఈ పోస్టు నియామకానికి అనుమతించడం డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబందనలకు వ్యతిరేకమని ఆయన కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఏ కళాశాలలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినప్పటికీ సీనియర్ రెసిడెన్సి పోస్టుకు అర్హులేనని న్యాయవాది జడ శ్రవణ్ వాదనలు వినిపించారు. పిటిషనర్ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. నోటిఫికేషన్ ను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతివాదులను కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇస్తూ.. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.