Bandi Sanjay : తెలంగాణలో పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అధికార టీఆర్ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అధికార పక్షంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడటం, దుందుడుకు వ్యవహార శైలితో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న బండి సంజయ్ దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం బూస్ట్ ఇచ్చింది. ఆ తరువాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో గతంతో పోల్చుకుంటే 15 రెట్లు అధికంగా సీట్లు సాధించడంతో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామే అన్నట్లుగా చెప్పుకొంటోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజెపీ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఇతర పార్టీలలో అసంతృప్తిగా ఉన్న సీనియర్ నేతలను పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే క్రమంలో టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు.
అయితే బండి సంజయ్ విమర్శలకు టీఆర్ఎస్ పార్టీ నేతల నుండి అంతగా రియాక్షన్ రావడంతో లేదు. ఈ మధ్య కాలంలో టీఆర్ఎస్ నేతలు మీడియా ముందుకు రావడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. బీజెపీ నేతల విమర్శలకు కౌంటర్ లు ఇవ్వడం లేదు. టీఆర్ఎస్ శ్రేణులు ఎందుకు అంతగా రియాక్ట్ కావడం లేదని ఎవరికీ అర్థం కావడం లేదు. ప్రధానంగా బీజెపీ అంటే భయంతోనే కొందరు టీఆర్ ఎస్ నేతలు బయటకు రావడం లేదని ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజెపీకి భయపడటం ఏమిటని అనుకుంటుండగా పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యే ల నివేదికలు బండి సంజయ్ తెప్పించుకున్నారని అంటున్నారు. ఆ నివేదికల ద్వారా వారిని ఇబ్బంది పెట్టడానికి బండి ప్రణాళిక సిద్ధం చేస్తున్నాడని టాక్.
టిఆర్ఎస్ ఎమ్మెల్యేల చార్జ్ షీట్ ల పేరుతో వారి అవినీతి అక్రమాలను బయటపెట్టడానికి నివేదికలు తెప్పించుకున్నారని అంటున్నారు. దాదాపుగా 18 మంది అధికార పార్టీల ఎమ్మెల్యే ల డేటా ఇప్పటికే సేకరించారన్న మాటలు వినబడుతున్నాయి. వారు పాల్పడిన అవినీతి అక్రమాలను వారి నియోజకవర్గాల్లో ప్రజలకు వివరించడానికి సిద్ధం చేస్తున్నారుట. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఇప్పుడు అదే పనిలో బిజీగా ఉందట. ఎన్నికల సమయంలో బీజెపీ నేతలు.. అవినీతి అక్రమాలకు పాల్పడిన ఎమ్మెల్యేల వివరాలు చార్జిషీటు రూపంలో జనాల ముందుకు తీసుకువెళితే వారు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. తద్వారా బీజెపి లాభపడాలన్నది ఆలోచన. ఈ విషయంలో వాస్తవం ఎంత ఉందో గానీ ప్రచారం మాత్రం జరుగుతోంది. ఏది ఏమైనా గతంతో పోల్చుకుంటే బండి సంజయ్ పగ్గాలు చేపట్టిన తరువాత బీజెపీ బాగానే పుంజుకుందనే మాట వినబడుతోంది. రాబోయే అసెంబ్లీ నాటికి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడాలి.