Coronavirus: దేశంలో రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి. కరోనా బారిన పడకుండా ఉండాలంటే రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం లభిస్తున్న వ్యాక్సిన్లలో చాలా టీకాలు అటువంటివే. అయితే అమెరికాలోని సెడార్ట్ – సినాయ్ మెడికల్ సెంటర్ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఓ కొత్త విషయాన్ని కనుగొన్నది. కరోనా బరిన పడి కొలుకున్న వారిలో యాంటీబాడీలు ఉంటాయి కాబట్టి అటువంటి వారు ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే చాలని తెలిపింది.
దాదాపు వెయ్యి మందితో నిర్వహించిన ఈ సర్వేలో కరోనా నుండి కోలుకున్న వారితో పాటు ఆ వైరస్ బారిన పడని వారు ఉన్నారు. కరోనా నుండి కోలుకున్న వారికి ఒక్క డోసు టీకా ఇవ్వగానే వారిలో రోగ నిరోధక శక్తి చాలా మెరుగుపడినట్లు పరిశోధకులు గుర్తించారు. అదే విధంగా కరోనా సోకిన వారిలో రెండవ డోసు వ్యాక్సిన్ ఇచ్చినప్పటికీ వారిలో అంతగా మార్పులు రాలేదని తెలిపింది.
ప్రస్తుతం చాలా దేశాలలో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో కరోనా నుండి కోలుకున్న వారికి ఒక్క డోసు మాత్రమే ఇవ్వడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల డోసుల వ్యాక్సిన్ లు మిగిలిపోతాయని యూనివర్శిటీ ఆఫ్ మేరీలాండ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్తవేత్తలు అంటున్నారు. సాధారణంగా కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అయి కొన్నాళ్లకు తగ్గిపోతాయి. మళ్లీ వైరస్ శరీరంలో చేరితే అవి క్రియాశీలకంగా మారతాయి. రోగ నిరోధక వ్యవస్థ వైరస్ ను గుర్తు పెట్టుకుని అది శరీరంలో చేరగానే పోరాడుతుంది. ఈ కారణంగా ఫిబ్రవరి నుండి ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి పలు దేశాలు కరోనా బారిన పడి కోలుకున్న వారికి రెండు డోసుల వ్యాక్సిన్ లలో కేవలం ఒక డోసు మాత్రమే ఇస్తున్నాయిట.