టీడీపీ మైనారిటీ నాయకుడు, ఉమ్మడి అనంతపురం జిల్లాలోని కదిరినియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే చాం ద్ బాషాకు సెగ పెరుగుతోంది. ఆయనకు ఈ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబుటికెట్ నిరాకరించారు. దీంతో నేరుగా ఉండవల్లికి వచ్చిన బాషా.. తనకు టికెట్ ఎందుకు ఇవ్వరని నిలదీశారు. అంతేకాదు.. టికెట్ ఇవ్వకపోతే.. సొంతగానే ముందుకు వెళ్తానని కూడా తేల్చిచెప్పారు. హిందూపురం ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని హడావుడి చేశారు.
కట్ చేస్తే.. ఈ వార్తలు నియోజకవర్గంలో కాకరేపాయి. చాంద్ బాషా హడావుడి.. ఆయన సవాళ్లు, డిమాండ్ల పై సొంత మైనారిటీ వర్గంలోనే తీవ్ర వ్యతిరేకత కనిపించింది. చాంద్ బాషాకు టికెట్ ఎందుకు ఇవ్వాలి? అనే ప్రశ్న మైనారిటీ వర్గాల్లోనే వినిపించింది. దీనికి కారణం.. ఆయన గత ఐదేళ్లుగా కనీసం నియోజక వర్గంలో ఒక్క వీధిలో కూడా పర్యటించకపోవడం. తనకు ఓట్లేసిన వారిని..(గతంలో), లేదా తన సొంత సామాజిక వర్గం మైనారిటీలను కూడా ఆయన కలుపుకొని వెళ్లలేదు.
కరోనా సమయంలో మైనారిటీ వర్గాలు ఆయన ఇంటి తలుపు తట్టాయి. సాయం చేయమని మైనారిటీ నాయకులు కోరారు. ఆయన మాత్రం అదిగో ఇదిగో అంటూ తప్పించుకున్నారే.. తప్ప.. కనీసం ఒక్క మాస్కు కొని పంచింది లేదు. అంతేకాదు.. మైనారిటీల్లోని పేదల పిల్లల వివాహాలకు సాయం చేయమని ఇద్దరు వచ్చి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. ఇక, పార్టీ పరంగా చూసుకుంటే..చంద్రబాబు పై దాడులు జరిగినప్పడు.. ఆయనను అరెస్టు చేసినప్పుడు.. పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసినప్పుడు కూడా ఆయన పట్టించుకోలేదు.
గోడమీద పిల్లి మాదిరిగా వైసీపీ నుంచి పిలుపు వస్తే.. వెళ్లిపోయి.. మళ్లీ కండువా కప్పుకొని పోటీచేయాలని చూశారనే వాదన చాంద్ బాషా వర్గంలోనే వినిపించింది. కనీసం లక్ష రూపాయలు.. పార్టీ కోసం ఖర్చు చేసింది లేదు. పార్టీ తమ్ముళ్లను కలుపుకొని పోయింది కూడా లేదు. మరి ఇలాంటి నాయకుడికి టికెట్ ఎందుకు? ఏం ఉద్ధరిద్దామని..అని మైనారిటీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ మరో మాట కూడా వినిపిస్తోంది. ఈయనకు టికెట్ ఇచ్చినా.. గెలిచినా.. ఓడినా మళ్లీ వైసీపీతీర్థం పుచ్చుకున్నా ఆశ్చర్యం లేదనిఆయన గూటి చిలుకలే పలుకుతున్నాయంటే ఆశ్చర్యం వేస్తుంది. ఇదీ.. సంగతి!