నిలకడలేని తీర్పు ఇచ్చే నియోజకవర్గంగా పిఠాపురానికి పేరుంది. వరుసగా ఎవరు గెలవరు. ఏ పార్టీని ఇక్కడి ప్రజలు ఓన్ చేసుకోరు. ఒకప్పుడు బీజేపీ, తర్వాత ప్రజారాజ్యం, తర్వాత ఇండిపెండెంట్, ఆ తర్వాత వైసీపీ.. ఇలా.. నాలుగు సార్లు నాలుగు విధాలుగా తీర్పిచ్చిన నియోజకవర్గం ఇదొక్కటే. దీంతో ఇప్పుడు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఆసక్తిగా మారింది. కాకినాడ జిల్లాలో కాపులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం, రాజోలు, అమలాపురం, కొత్తపేట ఉన్నాయి. అయితే ఇందులో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలుగా పిఠాపురం, అమలాపురం, రాజోలు కనిపిస్తున్నాయి.
ఇందులో పిఠాపురం మినహా అమలాపురం, రాజోలు రెండూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలే. 2019 ఎన్నికల్లో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు అంత అనుకూలం కాకపోవడంతో ప్రతికూల ఫలితాన్ని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈసారి ఆ తప్పు జరక్కుండా ఉండేందుకు జనసేన సర్వే విభాగం పిఠాపురంలో పటిష్టంగా సర్వే చేసింది.
కాపు ఓట్లు అత్యధికంగా ఉండడంతో పవన్ కల్యాణ్ను పిఠాపురం నుంచే పోటీచేయాలని పార్టీ కేడర్ ప్రోత్సహించింది. దీంతో ఆయనే పిఠాపురం నుంచి పోటీచేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడి ఓటర్లు విభిన్నమైన తీర్పునే ఇచ్చారు. 2004లో రాష్ట్ర మంతా వైఎస్ రాజశేఖర్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగిస్తే ఇక్కడ బీజేపీ తరపున పోటీచేసిన ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు గెలిచారు. ఆ తరువాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి ప్రస్తుత కాకినాడ ఎంపీ వంగా గీత గెలుపొందారు.
రాష్ట్ర విభజన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో 2009లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన ఎస్వీఎస్ఎన్ వర్మను కాదని పోతుల విశ్వానికి టీడీపీ టిక్కెట్టు ఇచ్చింది. వైసీపీ తరపున ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబు పోటీచేశారు. టీడీపీ రెబల్ అభ్యర్ధిగా పోటీలో దిగిన ఎస్వీఎస్ఎన్ వర్మ 47,080 ఓట్లు మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. 2019లో పెండెం దొరబాబు వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు ఎన్డీయే ఉమ్మడి అభ్యర్ధిగా పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీలో ఉన్నారు. దీంతో పార్టీ నాయకులు, కేడర్ అంతా ఇక్కడే ఉండి తమ నాయకుడ్ని ఎలాగైనా నెగ్గించుకోవాలన్న కసితో పనిచేస్తున్నారు.
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బరిలో ఉన్న వంగా గీతకు కూడా ఈ నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. గతంలో ప్రజారాజ్యం తరపున ఆమె ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఈ ఈక్వెషన్స్తోనే ఆమెను పిఠాపురం నుంచి వైసీపీ బరిలో దింపింది. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాదని వంగా గీతకు టిక్కెట్టు ఇవ్వడం వైసీపీ ఓటు బ్యాంకు కొంతవరకు పక్కకు మళ్లే అవకాశాలు లేకపోలేదని పలువురు చెబుతున్నారు. అదే సమయంలో వర్మకు కాదని పవన్కల్యాణ్కు టిక్కెట్టు కేటాయించడం టీడీపీ శ్రేణుల ఓట్లు చెదిరిపోయే అవకాశం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు.