రాజకీయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎంత శక్తివంతులో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో ప్రధానంగా ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులే అధికం.
అలాంటి నాయకులే స్వయంగా కొన్ని విషయాల్లో లైట్ తీసుకుంటున్న పరిస్థితి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు, కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసుల ఆదేశాలను కాదని ఈ ఏడాది కూడా పందెం రాయుళ్లు జోరుగా కోడిపందాలు నిర్వహించారు. దీంతో చట్టం , ఆదేశాల కంటే తమ సంతోషాలే ముఖ్యం అని స్పష్టం చేశారు పలువురు పందెం రాయుల్లు .
సంక్రాంతి సంబురాలతో…
పల్లెల నుంచి పట్నాల వరకు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాల శోభ అంబరాన్ని అంటింది. ఈ మూడు రోజుల పండుగలో భాగంగా వేకువ జామున చీకట్లను చీల్చుకుంటూ భోగి మంటల కాంతులు విరజిమ్మాయి. ముత్యాల ముగ్గులు, గొబ్బెమ్మలతో తెలుగు ముంగిళ్లు ముస్తాబయ్యాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ముందు రోజు భోగి వేడుకలు భోగ భాగ్యాలకు నాందిగా నిలవాలని వేడుకున్నారు. మనసులోని చెడు దహించుకుపోవాలని కోరుకుంటూ భోగి మంటలు వేశారు. మంచిని కాంక్షిస్తూ మకర సంక్రాంతిని ఘనంగా చేసుకున్నారు. కనుమ రోజున వాడవాడలా చిన్నాపెద్ద సందడి చేస్తున్నారు.
పంట సంబరమే కాదు… పందేలు కూడా…
ఆరు గాలం శ్రమించిన పంట చేతికొచ్చే వేళ సరికొత్త సంతోషాలు వ్యక్తమవుతూ పండుగ జరుపుకోవడమే కాకుండా కోడి పందేలు కూడా అదే రీతిలో జరిగాయి . గోదావరి జిల్లాల్లో అధికారుల ఆదేశాలకు భేఖాతరు చేస్తూ పందెం రాయుళ్లు కోడి పందేలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో కోడిపందేలు జోరుగా జరుగుతున్నాయి. అమలాపురం రూరల్ మండలం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో పోటాపోటీగా బెట్టింగులు నిర్వహించినట్లు సమాచారం. కాకినాడలోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ రూరల్ గ్రామాలైన తిమ్మాపురం, చిడిగి, నేమాం, పండురూ, గుడారిగుంట, సర్పవరం గ్రామాల్లో కోడి పందాలు జరిగాయని సమాచారం.
ఈ మూడు రోజులు అంతే….
ఎన్ని ఆంక్షలు ఉన్నా పండుగ మూడు రోజులూ పలు చోట్ల కోడి పందేలు నిర్వహిస్తున్నారు. కోడి పందేల శిబిరాలు వేసే స్థలాల వద్ద పోలీసులు నిఘా పెట్టినా ఫలితం లేకపోయింది. అయినప్పటికీ పందేలకు భారీగా శిబిరాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నా పందెంరాయుళ్లు మాత్రం వెనుకంజ వేయలేదు. ఇటు అధికార పార్టీ అటు ప్రతిపక్ష పార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు సైతం పలుచోట్ల ఏమీ చేయలేని పరిస్థితి ఎదురైందని సమాచారం.