Kanaka Durga Temple : విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఇటీవల ఏసీబీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగినట్లు గుర్తించిన విషయం తెలిసిందే. ఏసీబీ అధికారుల ప్రాధమిక నివేదిక ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం..ఆలయంలోని ఆరుగురు సూపర్నిటెండెంట్లతో సహా 15 మందిపై సస్పెన్షన్ వేటు వేసింది. ఆలయంలో జరిగిన అవినీతి బాగోతంలో అసలు బాధ్యుడైన కార్యనిర్వహణ అధికారిపై చర్యలు తీసుకోకుండా సిబ్బందిపై యాక్షన్ తీసుకోవడాన్ని ప్రతిపక్షాలు తప్పుబడుతున్నాయి.
ఆలయ ఇఓ సురేష్ బాబు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అనుచరుడు కావడం వల్లనే ఆయనపై చర్యలు తీసుకోలేదంటూ విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. గత రెండేళ్లలో ఆలయంలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించి అభియోగాలను మోపుతూ ఎసీబీ అధికారులు ప్రభుత్వానికి మరో నివేదిక పంపించారు. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ఆలయ ఇఓపై బదిలీ వేటు వేసింది. అయితే ఆయనపై సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.