ఏపిఎస్ ఆర్టీసీ వీసీ ఎండీగా మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ నియమితులైయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆర్పీ ఠాకూర్ ప్రింటింగ్ అండ్ స్టెషనరీ, స్టోర్స్ విభాగంలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రవాణా, రహదారులు భవనాల శాఖలో ఆయన సేవలను వినియోగించుకునేందుకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్ గా కూడా ఆర్ పీ ఠాకూర్ అదనపు బాధ్యతలు నిర్వహిస్తారని ఉత్తర్వులో వెల్లడించారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత మాదిరెడ్డి ప్రతాప్ ఏపీఎస్ ఆర్టీసీ ఎండిగా నియమితులైయ్యారు. అయితే ఆయనను అర్థాంతరంగా గత ఏడాది జూలై నెలలో ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీగా బదిలీ చేసింది. అప్పటి నుండి మాదిరెడ్డి ప్రతాప్ స్థానంలో ఆర్ టీసీ వీసీ ఎండిగా రవాణా శాఖ కార్యదర్శి కృష్ణబాబు అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు. నేడు తాజాగా మాజీ డీజీపీ ఆర్ పీ ఠాకూర్ ను ప్రభుత్వం నియమించింది.
ఆర్టీసీ ఎండిగా నియమితులైన సందర్భంగా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని ఆర్ పీ ఠాకూర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించినందుకు సీఎంకి ధన్యవాదాలు తెలిపారు.