Muncipal Elections : ఏపిలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే మరో ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గతంలో నిలిచిపోయిన ఎన్నికల ప్రక్రియను అక్కడి నుండే కొనసాగించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇప్పటికే నామినేషన్ ల స్వీకరణ ప్రక్రియ పూర్తికాగా నామినేషన్ ల ఉపసంహరణ ప్రక్రియ నుండి కొనసాగించనున్నట్లు ఈసీ తెలిపింది.
మార్చి 3వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకూ నామినేషన్ల ఉపసంహణ గడువుగా నిర్ణయించింది. అదే రోజు 3 గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించనున్నది, రాష్ట్ర వ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు మార్చి 10వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ జరుగుతుంది. 5 గంటల వరకూ క్యూలైన్ లో ఉన్న ఓటర్లు అందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. మార్చి 14వ తేదీ ఉదయం 8గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఈ రోజు నుండే రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లోనూ ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.